Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూ.. సిట్‌ దర్యాప్తులో తేలింది ఏంటి?

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు, కొవ్వులు కలిశాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Sep 2024 11:49 AM GMT
తిరుమల లడ్డూ.. సిట్‌ దర్యాప్తులో తేలింది ఏంటి?
X

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు, కొవ్వులు కలిశాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం లడ్డూ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది.

గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ బృందం తిరుమలకు చేరుకుంది. తిరుమలలోనే ఉండి లడ్డూ తయారీని పరిశీలించనుంది. అలాగే మాజీ టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, అప్పటి ఈవోలు, ఇప్పటి ఈవో శ్యామలరావు తదితరులను ప్రశ్నించనుంది

సిట్‌ తన దర్యాప్తులో భాగంగా మొదటి రోజు శ్రీవారిని దర్శించుకుంది. ఇక రెండో రోజు సెప్టెంబర్‌ 29న సిట్‌ బృందం సమావేశమైంది. ఎవరెవరు ఏయే పనులు చేయాలో బాధ్యతలు నిర్దేశించుకున్నారు. మరోవైపు కల్తీ నెయ్యి సరఫరాకు సూత్రధారులు, పాత్రధారులపై క్రిమినల్‌ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు.

ఏఆర్‌ డెయిరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసి, దేవస్థానాన్ని మోసం చేసిందంటూ టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మురళీకృష్ణ ఇటీవల తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో సిట్‌ దర్యాప్తుకు దిగింది.

సిట్‌ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సభ్యులు.. విశాఖ రేంజీ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు టీటీడీ ఈవో శ్యామలరావును ఆయన క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. ఏఆర్‌ డెయిరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై ఆయన నుంచి వివరాలు సేకరించినట్టు సమాచారం.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్‌ లో ప్రాథమికంగా ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి? వాటిలో గరిష్ఠ, కనిష్ఠ ధరలపై సరఫరా చేసేందుకు టెండరు వేసిందెవరు? కాంట్రాక్టర్‌ ఎంపిక ఎలా జరిగింది? నెయ్యి సరఫరా తీరు ఎలా ఉంది? వంటి అంశాలపై ఈవో నుంచి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.

ఈవోను కలిసిన అనంతం సిట్‌ అధికారులు ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మురళీకృష్ణను పిలిపించి వివరాలు సేకరించారని తెలుస్తోంది. ఎల్‌–1గా వచ్చిన సంస్థకు కాంట్రాక్టుని ఇచ్చే ముందు ఎల్‌–2 కూడా అదే ధరపై సరఫరాకు ముందుకొస్తే 65:35 ప్రాతిపదికన కట్టబెట్టే పద్ధతి ఉందా? అని ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం.

ఏఆర్‌ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో సిట్‌ ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో ఏఆర్‌ డెయిరీకి కూడా నోటీసులు ఇవ్వనుందని చెబుతున్నారు.