Begin typing your search above and press return to search.

పిన్నెల్లిని తొలిసారి అది పలకరిస్తుందా ?

పాపం పిన్నెల్లి అని అనాల్సి వస్తోంది. ఎందుకంటే ఆయన మాచర్లలో మకుటం లేని మహారాజుగానే దశాబ్దాలుగా వెలిగారు.

By:  Tupaki Desk   |   31 May 2024 3:44 AM GMT
పిన్నెల్లిని  తొలిసారి అది పలకరిస్తుందా ?
X

పాపం పిన్నెల్లి అని అనాల్సి వస్తోంది. ఎందుకంటే ఆయన మాచర్లలో మకుటం లేని మహారాజుగానే దశాబ్దాలుగా వెలిగారు. 2009లో కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పటి నుంచి ఎదురు లేకుండా గెలుస్తూ వస్తున్నారు.

ఆయన 2009లో కాంగ్రెస్ లో గెలిచినా వైఎస్సార్ కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. 2014, 2019లలో కూడా గెలిచారు. 2024లో కూడా ఆయనదే గెలుపు అన్న ధీమా ఉంది.

దీని కంటే ముందు జగన్ ప్రభుత్వంలో ఫస్ట్ లేదా సెకండ్ టెర్మ్ విస్తరణంలో మంత్రి కావాల్సిన వారు. సామాజిక వర్గ సమీకరణల వల్ల అది దక్కలేదు. ఈసారి గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని పిన్నెల్లి వర్గం భావించిన వేళ అనూహ్య పరిణామాలు మాచర్లలో జరిగాయి.

ఇక టీడీపీ నుంచి 1999లో గెలిచిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2004, 2009లలో ఓడారు. ఆయన్ని పక్కన పెట్టిన టీడీపీ సరిగ్గా ఈ ఎన్నికల్లో ముందుకు తెచ్చింది. ఆయన దూకుడు రాజకీయం చేస్తారు అని పేరు. పిన్నెల్లి వర్సెస్ జూలకంటి అంటే మాచర్ల ఈసారి అగ్గి రాజుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు.

చివరికి అదే జరిగింది. పిన్నెల్లి ఓటమికి కంకణం కట్టుకున్న టీడీపీ సంధించిన బ్రహ్మానందరెడ్డి అస్త్రం పవర్ ఫుల్ గా పనిచేసింది అని అంటున్నారు. పదకొండు పోలింగ్ బూత్ లలో టీడీపీ క్యాడర్ రిగ్గింగ్ చేసిందని వైసీపీ నేతలు పోలింగ్ రోజే విమర్శించారు.

అదే సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాలలో గట్టి బందోబస్తు పెట్టి ఆ పార్టీ ఓట్లు పెద్దగా పోల్ కాకుండా అడ్డుకున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో సహనం కోల్పోయిన పిన్నెల్లి ఏకంగా ఒక చోట ఈవీఎం నే ద్వంసం చేశారు.

దాంతో ఆయన మీద కేసులు పడ్డాయి. ఇలా ఒకటి అనుకుంటే మరొకటి జరగడంతో వైసీపీ కంచుకోటలో పసుపు జెండా ఎగరడానికి దాదాపుగా పాతికేళ్ల తరువాత ఆస్కారం ఏర్పడింది అని అంటున్నారు. 1999లో బ్రహ్మానందరెడ్డి టీడీపీ నుంచి గెలిచారు.

మళ్లీ ఆ పార్టీకి మాచర్లలో గెలుపు పిలుపు వినిపించలేదు. వరసగా కాంగ్రెస్ వైసీపీ గెలుస్తూ వచ్చాయి. అసలు టీడీపీ పుట్టాక మాచర్లలో గెలిచిందే మూడు సార్లు. అంత స్ట్రాంగ్ గా కాంగ్రెస్ కి బేస్ ఉన్న సీటు. ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి టర్న్ అయి ఆ పార్టీ గెలుస్తోంది.

అయితే పిన్నెల్లి విషయంలో వైసీపీ అధినాయకత్వం నుంచి కూడా అనుకున్నంతగా మద్దతు దక్కలేదు అని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ వ్యూహాలను పసిగట్టి కౌంటర్ స్ట్రాటజీని అమలు చేయడంలో కూడా వైసీపీ తడబడింది అని అంటున్నారు పోస్ట్ పోల్ సర్వేలు అంచనాలు చూస్తే కనుక టఫ్ ఫైట్ మాచర్ల లో జరిగింది అని అంటున్నారు.

అదే సమయంలో టీడీపీకే ఎడ్జ్ ఉందని కూడా చెబుతున్నారు. మరి తన పొలిటికల్ లైఫ్ లో ఫస్ట్ టైం పెన్నెల్లిని ఓటమి పలకరిస్తుందా అన్నదే ఆయన వర్గంలో భయాందోళలను కలుగ చేస్తోంది అంటున్నారు. అదే జరిగితే ఆయన కంటే బ్యాడ్ లక్ ఎవరికీ లేదు అని అంటున్నారు. ఒక వేళ వైసీపీ గెలిస్తే మంత్రి కావాల్సిన పిన్నెల్లి ఓడితే మాత్రం భారీ షాక్ అని అంటున్నారు. జూన్ 4 ఫలితాలు ఏమి చెబుతాయో చూడాల్సి ఉంది.