Begin typing your search above and press return to search.

"జగన్ మామయ్యా"... అసెంబ్లీ వద్ద జగన్ పై సెటైర్లు!

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ తాజాగా 16వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి

By:  Tupaki Desk   |   21 Jun 2024 8:25 AM GMT
జగన్ మామయ్యా... అసెంబ్లీ వద్ద జగన్ పై సెటైర్లు!
X

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ తాజాగా 16వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా... తొలిరోజు సభలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులతోపాటు.. అనంతరం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతక ముందు అసెంబ్లీ వద్ద జగన్ వద్ద కొంతమంది ఆకతాయిలు కామెంట్లు చేశారు.

అవును... ఏపీలో తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లోపలా, బయటా జగన్ విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా.. అసెంబ్లీ లోపల జగన్ గౌరవం ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో భాగంగా... జగన్ ను పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా... మాజీ ముఖ్యమంత్రి హోదాలో గౌరవించినట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... జగన్ ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలకు తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరి వచ్చారు. అయితే జగన్‌ కు విపక్ష హోదా కూడా లేకపోవడంతో.. ఆయన కారుతో పాటు మిగతా వైసీపీ ఎమ్మెల్యేల కార్లను అసెంబ్లీ బయటే ఉంచి లోపలోకి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. విపక్ష హోదా లేకపోయినప్పటికీ...మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనను కారుతో పాటు లోపలోకి అనుమతించేలా ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ఈ విషయాలను కేశవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా... వైఎస్ జగన్‌ కు ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో ఆయన కారును అసెంబ్లీ బయటే ఉంచి లోపలోకి రావాల్సి ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారును అసెంబ్లీ లోపలికి అనుమతించినట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల తెలిపారు.

అసెంబ్లీలోపల జగన్ పరిస్థితి అలా ఉంటే... అసెంబ్లీ వెలుపల మాత్రం చిన్నపాటి చేదు అనుభవం ఎదురైంది. ఇందులో భాగంగా... అసెంబ్లీ వద్ద ఆయన కాన్వాయ్ ని కొందరు ఆకతాయిలు ఫాలో అవుతూ కామెంట్ చేశారు. ఈ క్రమంలో "జగన్ మామయ్య.. జగన్ మామయ్య" అంటూ కేకలు వేస్తూ ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో... ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని.. జగన్ ను మాజీ సీఎం హోదాలో గౌరవించాలని వైసీపీ స్రేణులు కోరుతున్నాయి!