Begin typing your search above and press return to search.

పవర్ లోకి వచ్చిన తర్వాత బాబుకు తప్పని చేదు అనుభవం!

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత కుటుంబ సమేతంగా తిరుమలకు పయనమయ్యారు చంద్రబాబు

By:  Tupaki Desk   |   13 Jun 2024 5:29 AM GMT
పవర్ లోకి వచ్చిన తర్వాత బాబుకు తప్పని చేదు అనుభవం!
X

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత కుటుంబ సమేతంగా తిరుమలకు పయనమయ్యారు చంద్రబాబు. ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల కొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు షాకింగ్ అనుభవం ఎదురైంది. విపక్ష నేతగా తిరుమలకు వచ్చిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వ్యవహరించిన వైఖరిపై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో తన తొలి పర్యటనను తిరుమలకుపెట్టుకున్న వేళ.. తీరు మారని టీటీడీ అధికారుల కారణంగా హర్ట్ అయ్యారు చంద్రబాబు.

తిరుమలలోని గాయత్రి నిలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు టీటీడీ తరఫున ఎవరూ రాలేదు. దీంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చినప్పుడు ఆయన వాహనం దిగే వేళలో.. స్వాగతం పలికి.. పుష్పగుచ్చం ఇవ్వటం రోటీన్ గా సాగే ప్రక్రియ. కానీ.. తాజాగా మాత్రం అలాంటిదేమీ చోటు చేసుకోలేదు.

వాహనం దిగి గాయంత్రి నిలయంలోకి వెళ్లిన తర్వాత పుష్పగుచ్చం ఇచ్చేందుకు టీటీడీ ఇన్ ఛార్జి ఈవో వీరబ్రహ్మం ప్రయత్నించగా.. దాన్ని స్వీకరించేందుకు ముఖ్యమంత్రి బాబు రిజెక్టు చేశారు. గత ప్రభుత్వంలో టీటీడీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం.. తాను అధికారంలోకి వచ్చినంతనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో పాటు పాలనా వ్యవహారాల్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనుకుంటున్న బాబుకు.. తాజా పరిణామం ఈ అంశంపై మరింత కఠినంగా వ్యవహరించేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.