మోడీ - ట్రంప్ సేమ్ టు సేమ్... తులసీ గబ్బార్డ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఈ సందర్భంగా... భారత ప్రధాని మోడీతో డొనాల్డ్ ట్రంప్ స్నేహబంధం గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్థావించారు.
By: Tupaki Desk | 18 March 2025 2:00 PM ISTఢిల్లీ వేదికగా జరుగుతోన్న 10వ ‘రైసీనా డైలాగ్’ కార్యక్రమంలో అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల్లో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రస్థావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఢిల్లీలో జరుగుతోన్న రైసీనా డైలాగ్ కార్యక్రమంలో తులసీ గబ్బార్డ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా... భారత ప్రధాని మోడీతో డొనాల్డ్ ట్రంప్ స్నేహబంధం గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఇందులో భాగంగా... డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ శాంతిని కోరుకునే వ్యక్తి అని.. ప్రధాని మోడీ కూడా శాంతి పునరుద్ధరణకే కట్టుబడి ఉంటారని తెలిపారు.
ఇదే సమయంలో... అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే మోడీ అమెరికా పర్యటన చేపట్టడం.. వారి మధ్య ఉన్న స్నేహబంధంతో పాటు వారి వారి ప్రాధాన్యాలను చాటి చెబుతోందని అన్నారు. తమ తమ దేశాలకు ఉత్తమ సేవలు అందించాలని ఇద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారని గబ్బార్డ్ ప్రశంసించారు.
ఇదే క్రమంలో... ఎన్నికల సమయంలో ట్రంప్ నినాదం, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ విధానం అయిన "అమెరికా ఫస్ట్"పై తులసీ గబ్బార్డ్ స్పందించారు. చాలా మంది ఆయనను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని.. ఆయన ఒంటరివాది అని భావిస్తున్నారని.. ఇతర దేశాలతో ఘర్షణలు పెంచుకోవాలని చూస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారని ఆమె వెల్లడించారు.
అయితే... వాస్తవం అది కాదని.. ట్రంప్ చాలా మంది అనుకుంటున్నట్లు అలాంటి వ్యక్తి కాదని.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఆయన ప్రాధాన్యమిస్తారని.. తులసీ గబ్బార్డ్ వెల్లడించారు.
కాగా... ఢిల్లీ వేదికగా జరుగుతోన్న 10వ రైసీనా డైలాగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో 125 దేశాలకు చెందిన 3,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.