జగన్ 2.0 : ఉదయభాను మాస్ కామెంట్స్
వైసీపీ అధినేత జగన్ 2.0 స్టేట్మెంట్ పై జనసేన నేత సామినేని ఉదయభాను సంచలన కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 10 Feb 2025 1:30 PM GMTవైసీపీ అధినేత జగన్ 2.0 స్టేట్మెంట్ పై జనసేన నేత సామినేని ఉదయభాను సంచలన కామెంట్స్ చేశారు. జగన్ 1.0లో కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయానని, జగన్ 2.0లో వేరుగా ఉంటుందని వైసీపీ అధినేత కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ, జనసేన నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీ మారిన నేతల్లో సామినేని ఉదయభాను ఒకరు. జగ్గయ్యపేట నుంచి కాంగ్రెస్, వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించారు. కానీ ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో ఎన్నికలకు ముందే ఆయన జనసేనలో చేరాలని ప్రయత్నించారు. కానీ, వైసీపీ అధిష్టానం నచ్చజెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కూటమి సునామీలో ఓడిపోయిన ఉదయభాను.. ఎన్నికల అనంతరం వైసీపీకి రాం రాం చెప్పేశారు. జనసేనలో చేరి ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న ఉదయభాను ఈ నెల 16న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. ఇక పనిలోపనిగా వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎం జగన్ 2.0 కామెంట్స్ ను ఎద్దేవా చేశారు. జగన్ 2.0 ను ఎవరూ పట్టించుకోవాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. వైసీపీ నుంచి వస్తామంటూ చాలా మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని షాకింగ్ న్యూస్ బయటపెట్టారు.