Begin typing your search above and press return to search.

సనాతన ధర్మం : ఉదయనిధి అసలు వదలనంటున్నారే...!

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ఆయన అసలు వదిలేది లేదు అని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Sept 2023 11:05 PM IST
సనాతన ధర్మం : ఉదయనిధి అసలు వదలనంటున్నారే...!
X

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ఆయన అసలు వదిలేది లేదు అని చెబుతున్నారు. తాను ఎక్కడ ఏ మీటింగ్ కి వెళ్లినా సనాతన ధర్మం టాపిక్ ని టచ్ చేయకుండా ఉండడం లేదు. దాంతో ఇది డీఎంకే కి అత్యంత ఇష్టమైన అజెండాగా మారిపోతోందా అనిపిస్తోంది.

తండ్రి స్టాలిన్ సీఎం, కొడుకు మంత్రి, హాయిగా రాజ్యం చేసుకోకుండా ఈ సిద్ధాంతాల మీద రాద్ధాంతాలు ఏంటి అంటే అక్కడే ఉంది కధ అంటున్నాడు యువ స్టాలిన్. ఆయన డీఎంకే మూలాలలోకి వెళ్తున్నారు. తాత కరుణానిధి కాలం నాటి ఫిలాసఫీని తెర మీదకు తెచ్చి మరిన్ని కాలల పాటు పార్టీని తమిళ సీమలో ఉండేలా చూస్తున్నారు.

ఉదయనిధి స్టాలిన్ ఈ విషయంలో విజయం కూడా సాధిస్తున్నారు. ఆయన అందుకున్న ఈ రాగం కాస్తా అన్నా డీఎంకేకు కూడా వంటబట్టీనట్లుంది. అందుకే ఆ పార్టీ బీజేపీతో కటీఫ్ అనేంతవరకు వ్యవహారం వచ్చింది. దాంతో ఇపుడు మరింత రెచ్చిన తీరుతో ఆయన సనాతన ధర్మం మీద గళం విప్పుతూనే ఉంటాను అంటున్నారు.

తాజగా ఆయన మధురైలో జరిగిన ఒక కార్యక్రమంలో మరోసారి సనాతన ధర్మం మీద నోరు చేసుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు కానీ ఈ ప్రారంభోత్సవానికి బీజేపీ వారు తమిళనాడు నుంచి పూజారులను అయితే తీసుకెళ్ళారు భారత రాష్ట్రపతిని ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆవిడ వితంతువు అని ఉదయనిధి అంటున్నారు.

అంతే కాదు ఆమె గిరిజన జాతికి చెందిన మహిళ. మీ సనాతన ధర్మం అంటే ఇదేనా అని బీజేపీ వారిని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానికి తాను పూర్తి వ్యతిరేకమని, అందుకే తమ గళం ఎప్పటికీ విప్పుతూనే ఉంటామని అన్నారు.

మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వదలడం లేదు. తమిళనాడు రాజకీయ వరకూ ఆయన చూసుకుంటూ దాని మీద గళమెత్తుతున్నారు. దాని వల్ల అన్నాడీఎంకే బీజేపీ పొత్తుని విచ్చిన్నం చేయగలుతున్నారు. అయితే మరో వైపు ఇండియా కూటమిని ఇబ్బందులలో నెడుతున్నారని అంటున్నారు.

సనాతన ధర్మం మీద డీఎంకే ఇలా మాట్లాడుతూంటే మీ స్టాండ్ ఏంటి అని కాంగ్రెస్ ని బీజేపీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ సహా కూటమి నేతలు అంతా సనాతన ధర్మానికి వ్యతిరేకమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది మరింత కాలం ఇలాగే రాజకీయ రచ్చగా కొనసాగే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఉదయనిధి సనాతన ధర్మం రాగాలాపన రాజకీయాల రాద్ధాంతమా లేక సిద్ధాంతమా అన్నది కొద్ది నెలలు ఆగితే కానీ తెలియదు అంటున్నారు.