అమెరికా యుద్ధ ప్రణాళికలు మామూలుగా లేవుగా!
యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా జరిపిన దాడులకు సంబంధించిన రహస్య యుద్ధ ప్రణాళికలు బయటపడ్డాయి.
By: Tupaki Desk | 27 March 2025 10:05 AMయెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా జరిపిన దాడులకు సంబంధించిన రహస్య యుద్ధ ప్రణాళికలు బయటపడ్డాయి. మార్చి 15న జరిగిన ఈ దాడులకు సంబంధించిన కీలక వివరాలను 'అట్లాంటిక్' అనే పత్రిక తాజాగా వెల్లడించింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ ఏర్పాటు చేసిన 'సిగ్నల్ గ్రూప్' నుండి ఈ ప్రణాళికలు లీక్ అయినట్లు తెలుస్తోంది.
ఈ గ్రూప్ చాటింగ్ యొక్క స్క్రీన్ షాట్లను అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది. వీటిలో యెమెన్పై దాడులకు సంబంధించిన ప్రణాళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుద్ధ విమానాలు బయలుదేరినప్పటి నుండి దాడులు ముగిసే వరకు జరిగిన ప్రతి అప్డేట్ను ఈ గ్రూప్లో పోస్ట్ చేశారు.
ట్రంప్ ఆదేశాల మేరకు యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులకు బలమైన సంకేతాలు పంపాలని నిర్ణయించిన తర్వాత ఈ దాడులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి జాతీయ భద్రతా సలహాదారుడు మైక్ వాల్ట్జ్ 'సిగ్నల్ యాప్'లో రక్షణ మంత్రి పీట్ హెగ్సే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సహా 19 మందిని చేర్చారు. అయితే పొరపాటున అట్లాంటిక్ ఎడిటర్ జెఫ్రీ గోల్డ్బెర్గ్ కూడా ఈ గ్రూప్లో సభ్యుడిగా ఉండిపోయారు. ఈ గ్రూప్లోని మెసేజ్లు వారం తర్వాత స్వయంచాలకంగా తొలగిపోయేలా సెట్టింగ్లు మార్చబడ్డాయి.
ఈ గ్రూప్ హూతీ తిరుగుబాటుదారులపై దాడులకు సంబంధించి సమన్వయం చేస్తుందని మార్చి 13న వాల్ట్జ్ ఈ గ్రూప్లో మెసేజ్ చేశారు. ఈ క్రమంలో గ్రూప్లోని ఉన్నతాధికారులు వారి ఉత్తమ ఉద్యోగులకు ఈ సమన్వయ బాధ్యతలు అప్పగించాలని ఆయన కోరారు. అనంతరం విదేశాంగ మంత్రి, ఉపాధ్యక్షుడు, డీఎన్ఐ, సీఐఏ డైరెక్టర్తో సహా పలువురు తమ ప్రతినిధుల పేర్లను తెలియజేశారు.
అధ్యక్షుడి సూచనల మేరకు మీ అభిప్రాయాలను ఉదయానికల్లా హైసైడ్ ఇన్బాక్స్లలో (అమెరికా ప్రభుత్వ అధికారుల ఈమెయిల్ ఖాతాలు) ఉంచాలని వాల్ట్జ్ సూచించారు.
-వాన్స్ ఆందోళన:
ఈ దాడులకు సంబంధించి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కొన్ని హెచ్చరికలు చేశారు. "నేను ఆ రోజు మిషిగాన్కు వెళుతున్నాను. మనం తప్పు చేస్తున్నామని నాకు అనిపిస్తోంది. సూయజ్ కాలువ మార్గంలో అమెరికాకు చెందిన 3 శాతం వాణిజ్యం జరుగుతుంది. అదే సమయంలో ఐరోపాకు చెందిన 40 శాతం వ్యాపారం ఈ మార్గంలోనే సాగుతుంది. ఇది ఎందుకు అవసరమో ప్రజలు అర్థం చేసుకోకపోయినా ప్రమాదమే. అధ్యక్షుడు చెప్పినట్లు వారికి (హూతీలకు) ఒక సందేశం పంపడం మంచిదే. కానీ, ఇది ఎంత అస్థిరతకు దారి తీస్తుందో చూడాలి. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మిగిలిన వారు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
-దాడుల ప్రారంభం:
మార్చి 15న ఉదయం 11:44 గంటలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పీట్ హెగ్సే పోస్ట్ చేశారు. దాడులు ప్రారంభించబోతున్నట్లు సెంట్కామ్ ధృవీకరించిందని ఆయన గ్రూప్లో తెలిపారు. ఆ తర్వాత ఎఫ్-18 యుద్ధ విమానాలు దాడి ప్రారంభించాయని, కొన్ని నిమిషాల తర్వాత ఎంక్యూ-9 డ్రోన్లు రంగంలోకి దిగాయని హెగ్సే గ్రూప్ సభ్యులకు తెలియజేశారు.
-భవనం కూలింది:
ఈ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు వాల్ట్జ్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను ఉద్దేశించి "భవనం కూలింది" అని మెసేజ్ పెట్టారు. దీనికి వాన్స్ "ఏమిటి?" అని ప్రశ్నించారు. వాల్ట్జ్ స్పందిస్తూ, "వారి (హూతీల) అత్యున్నత క్షిపణి నిపుణుడు ఇప్పుడే తన గర్ల్ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్లాడు. వెంటనే మనం ఆ భవనంపై దాడి చేశాం. అది కూలిపోయింది" అని వివరించారు. దీనికి వాన్స్ "అద్భుతం" అని స్పందించారు. మిగిలిన సభ్యులకు కూడా అభినందనలు తెలిపారు. మరిన్ని దాడులు జరుగుతాయని హెగ్సే గ్రూప్లోని సభ్యులకు తెలియజేశారు.
ఈ లీకైన యుద్ధ ప్రణాళికలు అమెరికా సైనిక చర్యల యొక్క రహస్య స్వభావాన్ని.. అంతర్జాతీయంగా దాని ప్రభావాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.