పట్టభద్రుల బరిలో వలంటీర్లు.. ప్రభుత్వంతో నేరుగా కొట్లాట?
ఏపీలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.
By: Tupaki Desk | 3 Feb 2025 2:40 PM GMTఏపీలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఈ నెల 27న జరిగే ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే గత ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు.. ఈ రెండు స్థానాలపై గురిపెట్టాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఇంకా నైరాశ్యంలోనే ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. అయితే ఇదేసమయంలో కూటమి పార్టీల అభ్యర్థులపై పోటీకి వలంటీర్లు సై అంటుండటం ఆసక్తి రేపుతోంది.
క్రిష్ణ-గుంటూరు, గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వేడెక్కుతోంది. ప్రతిపక్షం వైసీపీ పోటీకి దూరంగా ఉండిపోవడంతో వార్ వన్ సైడేనని అంతా భావిస్తుండగా, అనూహ్యంగా పోటీకి సై అంటూ వలంటీర్లు దూసుకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకిచ్చిన మాటను విస్మరించిన కూటమికి దెబ్బతీయాలని భావిస్తున్న వలంటీర్లు పట్టభద్ర ఎమ్మెల్సీగా తమలో ఒకరిని పోటీకి నిలబెట్టాలని నిర్ణయించారు. విజయవాడలో తాజాగా జరిగిన సమావేశంలో గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీగా వలంటీర్ వానపల్లి శివ గణేశ్, క్రిష్ణ-గుంటూరు నుంచి వలంటీర్ లంక గోవింద రోజులు పోటీకి దిగనున్నారు. గత ప్రభుత్వంలో సేవలు అందించిన వలంటీర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టింది. అయితే పలు విధాలుగా పోరాటాలు చేసినా వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఎమ్మెల్సీగా పోటీ చేసి తమ సత్తా చాటాలని వలంటీర్లు నిర్ణయించారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి వలంటీర్లే కారణమనే అభిప్రాయం ఉంది. కార్యకర్తలను విస్మరించి వలంటీర్లకు పెద్దరికం ఇవ్వడం వల్ల కార్యకర్తలు అసంతృప్తికి లోనయ్యారు. దీనిఫలితం వైసీపీ అనుభవించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వలంటీర్లు మాత్రం ఐదేళ్లుగా ప్రజలకు సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నామని, కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రచారం చేస్తున్నారు. కూటమి గెలిస్తే వలంటీర్ల వేతనాలను రూ.10 వేలు చేస్తామని చెప్పారని, విద్యార్హతకు తగినట్లు ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అయితే గెలిచిన తర్వాత వలంటీర్లు విధుల్లోనే లేరని తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను మోసగించిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికను వాడుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఒక్కో ఎమ్మెల్సీ స్థానంలో దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒక్కోచోట సుమారు 1.50 లక్షల ఓటర్లను చేర్పించారు. ఈ పరిస్థితుల్లో కూటమి అభ్యర్థుల విజయంపై నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా వలంటీర్లు రంగంలోకి దిగడం, వారికి ఓటర్లతో నేరుగా సంబంధాలు ఉండటంతో ఎంతటి ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. వలంటీర్లు విజయం సాధించే అవకాశాలు లేకపోయినా వారికి దక్కే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకతను చాటుతాయని చెబుతున్నారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు ఉత్కంఠ రేపుతోంది.