Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ కొత్త చీఫ్ రాం మాధవ్ ?

అంటే దాని అర్ధం ప్రస్తుతం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన దగ్గుబాటి పురంధేశ్వరి పోస్టుకు ఎసరు వచ్చినట్లే అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:47 PM GMT
ఏపీ బీజేపీ కొత్త చీఫ్ రాం మాధవ్ ?
X

చాలా తొందరలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలోకి కొత్త ముఖాన్ని తీసుకుని వస్తున్నారు. అంటే దాని అర్ధం ప్రస్తుతం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన దగ్గుబాటి పురంధేశ్వరి పోస్టుకు ఎసరు వచ్చినట్లే అంటున్నారు. ఆమె బీజేపీ ప్రెసిడెంట్ అయి గట్టిగా రెండేళ్ళు కూడా కాలేదు ఇంతలోనే పోస్టు కిందకు నీళ్ళు ఎలా వచ్చాయి అంటే దానికి కేంద్ర పెద్దల వద్ద చాలానే మ్యాటర్ ఉందిట.

ఆమె ఏపీ చీఫ్ గా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు అని ఆమె మీద భర్త మాజీ మంత్రి వెంకటేశ్వరరావు ప్రభావం పడిందని, ఎన్నికల వేళ టికెట్ల విషయంలో కూడా బీజేపీలో కొందరికి అన్యాయం జరిగిందని ఇలా చాలా ఫిర్యాదులు ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి వెళ్ళాయని అంటున్నారు. అదే టైం లో ఆమె బీజేపీ ఎదుగుదల కంటే కూడా టీడీపీకి మేలు చేసేలాగానే ఎక్కువగా దృష్టి పెట్టారు అని కూడా సొంత పార్టీ నుంచి ఆరోపణలు విమర్శలు కూడా కేంద్ర బీజేపీ పెద్దలకు చేరాయని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో బీజేపీ బలోపేతానికి ఇంతకు మించిన తరుణం వేరొకటి లేదు అని భావిస్తున్నా బీజేపీ మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్ ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది అని అంటున్నారు ఏపీలో కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి బీజేపీని స్వతంత్రంగా పనిచేయనిస్తేనే కమలం ఏపీలో వికసిస్తుందని కూడా వారు కేంద్ర పెద్దలకు ఒక నివేదిక ఇచ్చారని అంటున్నారు.

అది కూడా ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారికే బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఇప్పటిదాకా ఈ పదవి విషయంలో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది. అయితే ఆయన రాజ్యసభకు ఎంపిక అయి కేంద్ర మంత్రి కావాలని కోరుకుంటున్నారని అంటున్నారు. ఆయన విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో బీజేపీకి కొత్త ముఖంగా ఎవరు వస్తారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. అయితే ఏపీకి చెందిన ఆరెస్సెస్ ప్రముఖుడు, బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారణాసి రాం మాధవ్ పేరు కూడా ఈ కీలక పదవి విషయంలో వినిపిస్తోంది.

కమలం కన్నే తెలియని ఈశాన్య రాష్ట్రాలలో కాషాయాన్ని ఆవిష్కరింపచేసిన ఘనత రాం మాధవ్ కి ఉంది. ఆయన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇంచార్జిగా వ్యూహకర్తగా పనిచేసిన గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ భారీగా ఓట్లూ సీట్లు తెచ్చుకుంది. నిబద్ధతతో పనిచేయడమే కాదు మిత్రుల మధ్య సయోధ్యను సక్రమంగా నెరుపుతూ సీట్ల బేరసారాల విషయంలో విషయంలో బీజేపీ ఎక్కడా తగ్గకుండా చూసుకుంటారన్న పేరు ఆయనకు ఉంది.

ఇక జనసేన బీజేపీ పొత్తును కూడా కలిపింది రాం మాధవ్ అని అప్పట్లో ప్రచారం ఉంది. ముందస్తు ఎన్నికలు అయినా లేక జమిలి ఎన్నికలు అయినా ఈసారి ఏపీలో బీజేపీ తనదైన రాజకీయ వాటాను పొందేందుకు కృషి చేస్తుందని అంటున్నారు. బీజేపీ జనసేన కలసి బలపడేందుకు ప్రయత్నం చేస్తాయని కూడా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాం మాధవ్ వంటి వారికి బీజేపీ కిరీటం దక్కితే మాత్రం ఏపీలో బీజేపీ దూకుడే ఒక రేంజిలో ఉంటుందని అంటున్నారు. మొత్తానికి తొందరలోనే బీజేపీకి కొత్త చీఫ్ వస్తారని సంచలన నిర్ణయాలే ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంతవరకూ ఉందో.