Begin typing your search above and press return to search.

ఇంతకూ 'డిక్లరేషన్‌' పై హైకోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి?

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 9:54 AM GMT
ఇంతకూ డిక్లరేషన్‌ పై హైకోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి?
X

ఆంధ్రప్రదేశ్‌ లో గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు, కొవ్వులు కలిశాయనే ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన నుంచి తిరుమల ఆలయ అధికారులు డిక్లరేషన్‌ తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఈ మేరకు జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని టీటీడీ అధికారులను కోరుతున్నారు.

తిరుమల శ్రీవారిని ఎవరైనా దర్శించుకోవచ్చు. అయితే హిందువులు కాకుండా అన్య మతస్తులు ఎవరైనా దర్శనానికి వస్తే స్వామి వారిపై తమకు అచంచల విశ్వాసముందని తెలియజేస్తూ దర్శనానికి ముందు డిక్లరేషన్‌ పై సంతకం చేయాల్సి ఉంటుంది.

అయితే వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ పై సంతకం చేస్తారా లేదా అనేది హాట్‌ టాపిక్‌ గా మారింది. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ ఎప్పుడూ డిక్లరేషన్‌ పై సంతకం చేయకుండానే శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన తొలిసారి శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు.

కాగా జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం తిరుమలలో దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్‌ ఇవ్వాలని.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో అమరావతికి చెందిన సామాజిక కార్యకర్త కోరుతూ పిల్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ పిటిషన్‌ పై విచారణ జరుపుతూ జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది.

ఇప్పుడు జగన్‌ డిక్లరేషన్‌ పై వివాదం రేగుతున్న వేళ నాటి హైకోర్టు తీర్పు వెలుగులోకి వచ్చింది. జగన్‌ డిక్లరేషన్‌ ఇస్తేనే ఆయనను దర్శనానికి అనుమతించాలని.. లేదంటే అనుమతించవద్దని కూటమి నేతలు డిమాండ్‌ చేస్తున్న వేళ ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

సాక్షాత్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే డిక్లరేషన్‌ అవసరం లేదని గతంలో తీర్పు చెప్పిందని.. అలాంటప్పుడు జగన్‌ ను ఇప్పుడు డిక్లరేషన్‌ ను కోరడంలో అర్థం లేదంటున్నారు. జగన్‌ ను శ్రీవారి దర్శనం చేసుకోనీయకుండా కూటమి నేతలు, టీటీడీ అధికారులు అడ్డుకోలేరని చెబుతున్నారు.