Begin typing your search above and press return to search.

ఏపీకి... చంద్ర‌బాబుకు అప్పులు త‌ప్ప‌వ్‌..?

కానీ అంతర్గ‌త‌ విశ్లేషణల్లో మాత్రం బడ్జెట్ ఏ మాత్రం ప్రయోజనాలను అందించలేకపోయిందని ఆయన కూడా ఒప్పుకున్న‌ట్టు తెలిసింది.

By:  Tupaki Desk   |   25 July 2024 11:30 AM GMT
ఏపీకి... చంద్ర‌బాబుకు అప్పులు త‌ప్ప‌వ్‌..?
X

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గమనిస్తే.. అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలోని త‌మ మ‌ద్ద‌తుతో ఉన్న ప్ర‌భుత్వం సహాయం చేస్తుందని సీఎం చంద్రబాబు ఆశించారు. అందుకే ఆయన నాలుగుసార్లు ఢిల్లీకి వెళ్లి మ‌రీ రాష్ట్ర పరిస్థితిని వివరించారు. ఇక‌, బ‌డ్జెట్ వ‌చ్చాక‌.. ఈ బడ్జెట్ చాలా గొప్పగా ఉందని, బడ్జెట్ కేటాయింపులు అద్భుతంగా ఉన్నాయని పైకి చెబుతున్నారు. కానీ అంతర్గ‌త‌ విశ్లేషణల్లో మాత్రం బడ్జెట్ ఏ మాత్రం ప్రయోజనాలను అందించలేకపోయిందని ఆయన కూడా ఒప్పుకున్న‌ట్టు తెలిసింది.

దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ముందున్న ఒకే ఒక అంశం అప్పులు తప్పని పరిస్థితి క‌నిపిస్తోంది. ఎందుకంటే అప్పులు చేసుకోవడానికి ప్రాధాన్య ఎంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అప్పులు చేసుకున్నా.. ఫ‌ర్వాలేదు, కానీ, మ‌మ్మల్ని ఏమీ అడగద్దు అనే ధోర‌ణిలో బడ్జెట్ ప్రసంగం కూడా సాగింది. ఏది ఇచ్చినా... అపురూపంలోనే అనేది నిర్మల సీతారామ‌న్ చెప్పుకొచ్చారు. వచ్చే 50 ఏళ్ల కాలానికి వడ్డీలు లేని విధంగా అప్పులు ఇప్పిస్తామని, ఈ విషయంలో రాష్ట్రాలు వియోగించుకోవాలని కూడా నిర్మలా సీతారామన్‌ చెప్పారు. వాస్త‌వానికి ఈ విష‌యం గతంలో చెప్పినట్టే.. ఇప్పుడు కూడా చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు చంద్రబాబు ముందున్న సమస్యలు పరిష్కారం కావాలంటే అప్పులు చేసుకోక తప్పని పరిస్థితి. పోనీ ఇప్ప‌టికి ఇప్పుడు సంపద సృష్టించాలన్నా రాష్ట్రంలో ఆ విధమైనటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మ‌రోవైపు.. అంతర్జాతీయ నివేదికలు... ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశం వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని గొడవలు చేస్తున్నారని పేర్కొంటున్నాయి. సహజంగానే అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసే అంశాలను పెట్టుబ‌డి దారులు విశ్వ‌సిస్తారు.

చంద్రబాబుపై వారికి నమ్మకం ఉండవ‌చ్చు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల‌న్న ఉత్సాహం ఉండొచ్చు. కానీ ఇప్పటికిప్పుడైతే వచ్చే అవకాశం కనిపించట్లేదు. కానీ అమ‌లు చేయాల్సిన‌ పథకాలు, మరోవైపు ఇతర పనులను చూసినప్పుడు.. అప్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని ఆపేస్తే.. ప్రతిపక్షాలు ప్రశ్నించవ‌ని, లేదా ఎదురు దాడి చేయొచ్చ‌ని చంద్రబాబు కాలం గడిపిస్తే ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు రేపు త‌ట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి అప్పు చేసైనా సరే అభివృద్ధి దిశ‌గా రాష్ట్రాన్ని అడుగులు వేయించాల్సిన అవసరం ఉంది.

ఇదే విష‌యాన్ని టీడీపీ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పు చేసాడు అని చెప్పిన ప్రభుత్వం ఈ 50 రోజుల కాలంలో పింఛన్ల రూపంలో ఇచ్చేందుకు, ఇతర అవసరాలకు కానీ 12 వేల కోట్లు చేసిందని నివేదిక స్పష్టం చేస్తున్నాయి. దీనిని ఓ వర్గం మీడియా దాచిపెట్టినా.. మరో వైపు తెలుసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ప్రచారం చేసింది. అయితే.. అయిందేదో అయినా.. ఇప్పుడు అప్పులు చేసైనా కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.