Begin typing your search above and press return to search.

బాబు కలను తీర్చనున్న మోడీ ?

ఒక విధంగా బాబు రాజకీయ ప్రస్థానం చూస్తే ఎన్నో రికార్డులు ఆయన సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 1:29 PM GMT
బాబు కలను తీర్చనున్న మోడీ ?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కన్న కల చాలా భారీగానే ఉంది. అది అత్యంత ఖరీదైనది కూడా. ఆ కల తీరితే బాబుకు ఎదురుండదు. ఆయన చరితార్ధుడు అవుతారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు పాలిస్తారు కానీ చరిత్రలో నిలిచే వారు కొందరే. ఆ సువర్ణ అవకాశం ఇపుడు బాబుకు దక్కబోతోంది అని అంటున్నారు.

ఒక విధంగా బాబు రాజకీయ ప్రస్థానం చూస్తే ఎన్నో రికార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు సార్లు సీఎం అయిన ఘనత బాబుదే. అలాగే సైబరాబాద్ లాంటిది నిర్మించి హైదరాబాద్ రూపు రేఖలు మార్చింది కూడా బాబే అని చెప్పాలి.

ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టిన గొప్పదనం ఆయనదే. బాబు ఈ దఫా కనుక సీఎం గా అయిదేళ్ళూ పూర్తి చేస్తే 18 ఏళ్ల 250 రోజుల పాటు పనిచేసిన ఏకైక తెలుగు సీఎం గా చరిత్రలో ఉంటారు. అలాగే బాబు యాభై ఏళ్ళ పొలిటికల్ కెరీర్ కూడా ఇదే టెర్మ్ లో పూర్తి కాబోతోంది. ఆయన 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2028 నాటికి హాఫ్ సెంచరీ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి.

అప్పటికి బాబు సీఎం గా ఉంటారు కాబట్టి ఆ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే టైం లో అమరావతి రాజధాని పరిపూర్తికి టీడీపీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం పనిచేస్తోంది. మంత్రి నారాయణ చెప్పినదే చూసుకుంటే రెండున్నరేళ్లలో అమరావతి తొలి దశ పనులు పూర్తి అవుతాయి. సిటీ నిర్మాణం పూర్తి అవుతుంది.

దీనికి 48 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇంత మొత్తం ప్రభుత్వం దగ్గర లేదు ఎలా అన్న బెంగ అవసరం లేదు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను విడుదల చేయనుంది అని అంటున్నారు. అమరావతిలోని మొత్తం 50 వేల ఎకరాలలో రోడ్ల నిర్మాణం కోసం ఏకంగా 40 వేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేస్తుంది అని అంటున్నారు.

కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ మద్దతు మీదనే అధారపడి ఉంది. దాంతో చంద్రబాబు పలుకుబడి ఇపుడు జాతీయ స్థాయిలో అపారంగా ఉంది. దీనిని ఆయన బాగానే వినియోగించుకుంటున్నారు అని అంటున్నారు. కేంద్రం నలభై వేల కోట్ల రూపాయలు అమరావతి రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా విడుదల చేస్తుంది అన్నది నిజంగా ఏపీకి అత్యంత శుభవార్త అని చెబుతున్నారు.

మౌలిక సదుపాయాలు కనుక సమకూరితే అమరావతి రాజధానికి ఒక రూపూ షేపూ వచ్చేస్తుంది. ఆ మీదట అక్కడ రియల్ బూమ్ మామూలుగా ఉండదు. దాంతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ పార్టనర్ షిప్ తో నిర్మాణాలు వ్యాపారాలు జోరు అందుకుంటాయి. చంద్రబాబు ఈ టెర్మ్ లోనే అమరావతి రాజధానిని ఒక అద్భుతమైన షేపులో నిర్మించి ప్రజలకు అంకితం చేస్తారు అని అంటున్నారు.

ఈ విధంగా అమరావతికి భారీ నిధుల కొరతను కేంద్రం తీర్చనుంది అని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ సర్కార్ ఉంది అయినా అమరావతి రాజధానికి పెద్దగా సహకరించిన సందర్భాలు అయితే లేవు.

కానీ ఈసారి మాత్రం కేంద్రం ఏపీ మీదనే ఆధారపడడం తో భారీ ఎత్తున నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం గా ఉంది. ఇక కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా బాబుకు మంచి సన్నిహితులు. దాంతో ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఢోకా ఉండబోదు అంటున్నారు. దాంతో పాటు బాబు కలను మోడీ ఈ విధంగా సాకారం చేయనున్నారు అని అంటున్నారు.