Begin typing your search above and press return to search.

రుషికొండ ప్యాలెస్ కధ బాబు తేలుస్తారా ?

ఇపుడు చంద్రబాబు ఎటూ వస్తున్నారు. ఆయన రుషికొండ ప్యాలెస్ లో అడుగు పెడతారా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో రుషికొండ ప్యాలెస్ మీద మీడియా కచ్చితంగా అడుగుతుంది.

By:  Tupaki Desk   |   11 July 2024 4:11 AM GMT
రుషికొండ ప్యాలెస్ కధ బాబు తేలుస్తారా ?
X

ముఖ్యమంత్రి హోదాలో విశాఖ జిల్లా పర్యటనకు తొలిసారి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చిన తరువాత సీఎం గా రావడంతో అభిమానులు తమ్ముళ్లలో ఆనందం వెల్లి విరుస్తోంది. దాదాపు రెండున్నర నెలల తరువాత చంద్రబాబు విశాఖలో అడుగు పెడుతున్నారు.

చంద్రబాబు విశాఖ రాక సందర్భంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆయన కార్యక్రమాలు కూడా ఫిక్స్ అయ్యాయి. అయితే విశాఖ అంటే రుషికొండ ప్యాలెస్ గా ఇటీవల కాలంలో ప్రచారం సాగింది. ప్రజాధనం దుర్వినియోగం చేసి భారీ ఎత్తున కట్టారని అయిదు వందల కోట్ల రూపాయలను అలా ఖర్చు చేయడమేంటి అని అధికార కూటమి నేతలు విమర్శలు చేసారు

ఇక రుషికొండ ప్యాలెస్ లో ఏముందో అన్న ఆరాటానికి అతృతకు తెర తీస్తూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ ప్యాలెస్ తలుపులు తెరచి మీడియా ముఖంగా లోకానికి అంతటికీ అన్నీ చూపించేశారు. చాలా లావిష్ గా ఖర్చు చేసి మరీ రుషికొండ ప్యాలెస్ ని కట్టారు అని అందరికీ అర్థం అయింది.

ఇంత పెద్ద ఎత్తున కట్టిన ప్యాలెస్ ని వృధా చేయడం కంటే వాడుకోవడం మంచి పరిణామమని అన్నారు. అయితే ఈ ప్యాలెస్ ఇపుడు మళ్లీ చర్చకు వస్తోంది. చంద్రబాబు ఒక రోజంతా విశాఖలో ఉండనున్నారు. దాంతో రుషికొండ ప్యాలెస్ విషయం చంద్రబాబుతో మాట్లాడి ఏమి చేయాలో నిర్ణయిస్తామని భీమిలీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా మీడియాకు అప్పట్లో చెప్పారు.

ఇపుడు చంద్రబాబు ఎటూ వస్తున్నారు. ఆయన రుషికొండ ప్యాలెస్ లో అడుగు పెడతారా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో రుషికొండ ప్యాలెస్ మీద మీడియా కచ్చితంగా అడుగుతుంది. దానికి బాబు ఏమని చెబుతారు. ఏ విధంగా ప్యాలెస్ ని వాడుకుంటామని బదులిస్తారు అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి రుషికొండ ప్యాలెస్ బాబు రాక వేళ మళ్లీ మారు మోగుతోంది. మరి చంద్రబాబు రుషికొండ మీద తేల్చేస్తారా లేక మరోసారి వచ్చినపుడు దాని సంగతి మాట్లాడుదామని చెబుతారా అన్నది చూడాల్సి ఉంది.