Begin typing your search above and press return to search.

వైసీపీకి భారీ డ్యామేజ్... చేసిందంతా వెంకటరెడ్డేనా?

అయితే ఈ ఘోరానికి గల ప్రధాన కారణాల్లో వెంకటరెడ్డి ఒకరనే చర్చ ఇప్పుడు పార్టీలో బలంగా మొదలైందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2024 7:30 AM GMT
వైసీపీకి భారీ డ్యామేజ్... చేసిందంతా వెంకటరెడ్డేనా?
X

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అదికూడా సాదాసీదా ఘోరం కాదు! గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ.. ఐదేళ్లు తిరిగేలోపు 11 స్థానలకు పరిమితమైపోయినంత ఘోరం. అయితే ఈ ఘోరానికి గల ప్రధాన కారణాల్లో వెంకటరెడ్డి ఒకరనే చర్చ ఇప్పుడు పార్టీలో బలంగా మొదలైందని అంటున్నారు.

అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి, కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు అని చెబుతున్నప్పటికీ.. కొన్ని మాత్రం అత్యంత కీలక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగానే... గనుల శాఖ డైరెక్టర్ గా మరో రాష్ట్రం నుంచి తెచ్చుకుని మరీ నియమించుకున్న వెంకటరెడ్డి ఆ కీలాక కారణాల్లో కీలకం అని చెబుతున్నారు.

ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఈ తరహా చర్చ బలంగా నడుస్తోంది. వాస్తవానికి వైసీపీ ఘోర పరాజయానికి లిక్కర్ పాలసీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లు ప్రధాన కారణాలనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు, సర్వే రాళ్లపై ఫోటోలు వంటి వ్యూహాత్మక సలహాలు, పతనమైపోయే సూచనలు ఇచ్చిన వెంకటరెడ్డి అంటూ వైసీపీ నేతలు ఆయనను తెగ తలుచుకుంటున్నారంట.

వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి.. ఇసుక, గనుల వ్యవహారాలను అన్నీ తానై చక్కబెట్టారు! ఇదే సమయలో... రైతులకు ఇచ్చే పాస్ బుక్స్ పై బొమ్మలు వేయించాలనీ, ల్యాండ్స్ రీ సర్వే చేసిన తర్వాత సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు చెక్కించాలని ఆలోచించింది ఈయన మస్తిష్కమే అని వైసీపీ నేతలు నాటి రోజులు తలచుకుని ఫైరవుతున్నారంట!

ఈ పాస్ పుస్తకాలపైనా, సరిహద్దు రాళ్లపైనా జగన్ బొమ్మలు అంశం ప్రధానంగా గ్రామస్థాయిలో ఎంత డ్యామేజ్ చేసిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే అదనుగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. కానీ... ఆ విమర్శలు రాజకీయంగా వైసీపీకి పెద్ద డ్యామేజీ కలిగిస్తున్నాయనే విషయం మాత్రం వెంకటరెడ్డి లైట్ తీసుకునేలా చెప్పారని అంటున్నారు.

మిగిలినవాళ్ల సంగతి కాసేపు పక్కనపెడితే... వెంకటరెడ్డి తీసుకున్న ఈ దారుణ నిర్ణయానికి జగన్ తలూపడమే ఈ భారీ డ్యామేజీకి కారణం అని అంటున్నారు. పైగా సరిహద్దు రాళ్లకు సుమారు రూ.350 కోట్లతో టెండర్ ఇప్పించి కూడా వెంకటరెడ్డే అనేది మరో ఆరోపణ. ఏది ఏమైనా... ప్రస్తుతం వైసీపీ నేతలు మాత్రం వెంకటరెడ్డిని తెగ తలచుకుంటున్నారని తెలుస్తోంది.

అందుకే అంటారు... గుర్రాన్ని రౌతు నడిపించాలి కానీ, రౌతుని గుర్రం గైడ్ చేయకూడదని.. అధికారులను ముఖ్యమంత్రి గైడ్ చేయాలి కానీ.. సీఎంని అధికారులు కాదు కదా!!