Begin typing your search above and press return to search.

జగన్‌ సమక్షంలోనే... మంత్రి వర్సెస్ ప్రభుత్వ విప్‌!

By:  Tupaki Desk   |   12 Aug 2023 2:08 PM IST
జగన్‌ సమక్షంలోనే... మంత్రి వర్సెస్ ప్రభుత్వ విప్‌!
X

స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ సొమ్ము ఖాతాల్లో జమచేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం అమలాపురం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని హెలిప్యాడ్‌ వద్ద మంత్రి వర్సెస్ ప్రభుత్వ విప్ గా జరిగిన ఒక సంఘటన చర్చనీయాంశమైంది.

అవును... డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వాగతం పలికే సమయంలో ఒక కీలక సంఘటన జరిగింది. ఇందులో భాగంగా... అమలాపురం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని హెలిప్యాడ్‌ వద్ద స్వాగతించేటప్పుడు ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి - మంత్రి పినిపే విశ్వరూప్‌ మధ్య చిన్నసైజు వార్ నడిచింది.

హెలిప్యాడ్‌ వద్ద జగన్ ను స్వాగతించేటప్పుడు ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. వైసీపీ యువ నాయకుడు వాసంశెట్టి సుభాష్‌ తండ్రి సత్యంను సీఎంకు పరిచయం చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మంత్రి పినిపే విశ్వరూప్‌ అసహనం వ్యక్తం చేస్తూ.. తన నియోజకవర్గంలో నీకేంటి పని అంటూ జగ్గిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ప్రతిగా జగ్గిరెడ్డి.. "నాకంతా తెలుసు.. తగ్గు తగ్గు" అన్నట్లు చేత్తో సైగలు చేయడంతో... ఆ వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో కల్పించుకున్న ముఖ్యమంత్రి... ఏమైందని ఆరా తీయగా.. ఏమీ లేదంటూ ముందుకు కదిలారు నేతలు!

కాగా... ఇటీవల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబానికే రామచంద్రపురం అసెంబ్లీ సీటు అంటూ పట్టుబడుతోన్న సంగతి తెలిసిందే!