Begin typing your search above and press return to search.

మా ఆయన టీడీపీ.. నేను జగనన్న పార్టీ.. మా ఆయన్ను వదిలేశా

తాజాగా పోస్టు చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున షేర్ అవుతూ.. ఆ వీడియో గురించి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి

By:  Tupaki Desk   |   24 March 2024 4:30 AM GMT
మా ఆయన టీడీపీ.. నేను జగనన్న పార్టీ.. మా ఆయన్ను వదిలేశా
X

ఇప్పుడు నడుస్తున్నది ఎన్నికల కాలం. సెలబ్రిటీలు.. ప్రముఖుల మాటల కంటే సాదాసీదా ప్రజల నోట్లో నుంచి వచ్చే మాటలు.. వారి మనోభావాలు.. వారి ఆశలు..ఆకాంక్షల్ని ఒడిసిపట్టి ప్రజలకు చేరవేసేందుకు వీలుగా యూట్యూబర్లు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఏపీలో జరుగుతున్న మహా ఎన్నికల యుద్ధం వేళ యూట్యూబర్లు భారీ ఎత్తున ఊళ్లకు వెళుతున్నారు. వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారు. వాటికి సంబంధించిన వీడియోల్ని పోస్టు చేస్తున్నారు. తాజాగా పోస్టు చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున షేర్ అవుతూ.. ఆ వీడియో గురించి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి.

ఇంతకూ ఆ వీడియో సారాంశం ఏమంటే.. జగనన్న కోసం తన భర్తను కూడా వదిలేశానంటూ ఒక సాదాసీదా గృహిణి నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనంగా మారాయి. అభిమానం సహజం కానీ.. భర్తను వదిలేసేంత అభిమానమా? అంటూ అవాక్కు అవుతున్నారు. జగనన్న మీద అభిమానం సామాన్యుల గుండెల్లో ఎంత ఉందన్న విషయాన్ని తెలిపేలా ఈ వీడియో ఉందంటున్నారు.

ఈ వీడియోలో మాట్లాడిన మహిళ పేరు రంగనాయకమ్మ. ఆమె ముందు మైకు పెట్టిన వేళ.. జగనన్న మీద తనకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పేసింది. ముఖ్యమంత్రి జగన్ పాలనలో పేద ప్రజలంతా అన్నం తింటున్నారనీ.. పిల్లలకు చదువులు బాగున్నాయని.. తొమ్మిదో తరగతి చదువుతున్న తన కొడుక్కి జగనన్న ట్యాబ్.. పుస్తకాలు.. బ్యాగ్ ఇచ్చాడన్న ఆమె.. ఏ ప్రభుత్వంలోనూ తమకు ఇలా జరగలేదని పేర్కొన్నారు. జగనన్న గెలిస్తే పండగ చేస్తానంటూ ఆయనపై తనకున్న అభిమానాన్ని ప్రదర్శించారు.

ఈ క్రమంలో తన భర్త గురించి చెబుతూ.. జగనన్న కోసం తాను తన భర్తను వదిలేసినట్లుగా చెప్పింది. తన భర్తకు ఒక పథకం విషయంలో ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని.. టీడీపీకి ఓటేయమన్నాడని.. తాను జగనన్నకు మాత్రమే ఓటేశానని చెప్పారు. అందుకే తన భర్త తనను వదిలేసి వెళ్లాడన్న ఆమె.. భర్తను అయినా వదులుకోవటానికి తాను సిద్ధమని.. అంతే తప్పించి జగనన్నను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. తన భర్త టీడీపీ అని.. తాను మాత్రం వైసీపీ అని.. తాను జగనన్న పార్టీ అంటూ సగర్వంగా చెప్పుకున్న రంగనాయకమ్మ ఆంటీ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.