Begin typing your search above and press return to search.

రోటీన్ కు భిన్నంగా మందుబాబులకు బనగానపల్లి కోర్టు శిక్ష

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన వారిని నంద్యాల జిల్లా బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట హాజరుపర్చారు.

By:  Tupaki Desk   |   26 Feb 2025 5:30 AM GMT
రోటీన్ కు భిన్నంగా మందుబాబులకు బనగానపల్లి కోర్టు శిక్ష
X

ఎవరు చెప్పినా వినరు. ఇంట్లో వారి మాటల్నిఅస్సలు లక్ష్య పెట్టరు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ చుట్టూ ఉన్న వారికి తీవ్ర ఇబ్బందుల్ని.. అసౌకర్యాన్ని కలిగించే మందుబాబులు కొందరు ఉంటారు. అలాంటి వారికి తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానపల్లి కోర్టు వెరైటీ శిక్ష విధించిన వైనం అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన వారిని నంద్యాల జిల్లా బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట హాజరుపర్చారు. వీరికి రోటీన్ కు భిన్నమైన శిక్ష వేశారు న్యాయమూర్తి షేక్ అబ్దుల్ రెహ్మాన్. ఇంతకూ వారికి వేసిన శిక్ష ఏమిటో తెలుసా? మద్యం సేవిస్తే కలిగే అనర్థాలు.. రోడ్డు మీద ప్రయాణించే వేళ పాటించాల్సిన నిబంధనల్ని ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శిస్తూ నిలుచోవాలని ఆదేశించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పట్టుబడిన 47 మంది చేతికి ఫ్లకార్డులు ఇచ్చి.. ప్రభుత్వ కార్యాలయాలు.. బహిరంగ ప్రదేశాల్లో నిలబెట్టాలని తీర్పు ఇవ్వటంతో.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వారికి ఆ శిక్ష విధించారు.ఇదంతా వారిలో పరివర్తన కోసమేనంటూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్ని పలువురు ఏకీభవిస్తున్నారు. మద్యాన్ని ఇష్టారాజ్యంగా తాగే వారిలో పరివర్తన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.