Begin typing your search above and press return to search.

వైఎస్‌ వివేకా హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   26 July 2024 6:57 AM GMT
వైఎస్‌ వివేకా హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌!
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును సీబీఐ కోర్టు తప్పించింది. అతడు అప్రూవర్‌ గా మారి.. కేసు విచారణకు సహకరిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దస్తగిరి సైతం తాను అప్రూవర్‌ గా మారినందున తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరాడు. తనను సాక్షిగా పరిగణించాలని విన్నవించాడు. దీంతో కోర్టు అతడిని నిందితుల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

సీబీఐ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌ లోనూ అతడిని సాక్షిగా చేర్చిన విషయాన్ని దస్తగిరి న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తీసివేసింది. ఈ క్రమంలో వివేకా హత్యకేసులో దస్తగిరిని ఇక నుంచి సాక్షిగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది.

2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్‌ వివేకా పులివెందులలోని తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదని.. రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో కేసు విచారణ నత్తనడకన నడుస్తుండటంతో వివేకా కుమార్తె సునీత సీబీఐ విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది.

అలాగే ఏపీలో కేసు విచారణ సజావుగా సాగడం లేదని.. దీన్ని తెలంగాణ రాష్ట్రానికి మార్చాలని సునీత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపైనా కోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ఇప్పటికే సీబీఐ ఈ కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి తదితరులను అరెస్టు చేసింది. అవినాష్‌ రెడ్డి మినహాయించి మిగిలినవారంతా హైదరాబాద్‌ లోని చెంచలగూడ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత వీరిలో భాస్కర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి తదితరులు బెయిల్‌ పొందారు. అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు.

కాగా సీబీఐ నమోదు చేసిన కేసులో దస్తగిరి నాలుగో నిందితుడిగా ఉన్నాడు. వివేకాను చంపడానికి అవసరమైన గొడ్డలిని తానే కొనుక్కు వచ్చినట్టు అతడిపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్లపాటు అతడు జైల్లో ఉన్నాడు. తర్వాత అప్రూవర్‌ గా మారడంతో అతడికి సీబీఐ అంగీకారం మేరకు కోర్టు బెయిల్‌ ఇచ్చింది.

వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో అతడు వెల్లడించాడు. దీంతో అప్రూవర్‌ గా మారడంతో తనను సాక్షిగా పరిగణించాలని చేసిన విన్నపం మేరకు అతడిని నిందితుల జాబితా నుంచి కోర్టు తొలగించింది.