140 కోట్ల మంది ప్రజల్ని టెన్షన్ పెట్టిన హైకోర్టు తీర్పు
గుజరాత్ హైకోర్టు తాజా తీర్పు ఒక మైలురాయి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ల వంటి ప్రభుత్వ పత్రాలలో నమోదు చేసిన పుట్టిన తేదీని ఒక వ్యక్తి పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని నిర్ధారించింది.
By: Tupaki Desk | 23 Feb 2025 7:30 PM GMTపుట్టిన తేదీని నిరూపించేందుకు ఆధార్ కార్డ్ , పదో తరగతి మార్కుల లిస్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ ఏదో ఒకటి సరిపోతుందని ప్రజలు భావిస్తున్నారు. కానీ అది సరిపోదు. భారతదేశంలోని 140 కోట్ల మంది జనాన్ని టెన్షన్ పెట్టే తీర్పును హైకోర్ట్ తాజాగా వెలువరించింది. ఇకపై బర్త్ డేట్ ని ప్రూవ్ చేయడానికి జనన ధృవీకరణ పత్రం తేవాలని అధికారులు అడుగుతారు.
గుజరాత్ హైకోర్టు తాజా తీర్పు ఒక మైలురాయి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ల వంటి ప్రభుత్వ పత్రాలలో నమోదు చేసిన పుట్టిన తేదీని ఒక వ్యక్తి పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని నిర్ధారించింది. జనన మరణాల నమోదు రిజిస్టర్లో నమోదు చేసినట్లుగా అధికారిక జనన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న పుట్టిన తేదీకి మాత్రమే చట్టపరమైన అధికారం ఉందని కోర్టు స్పష్టం చేసింది.
అధికారిక రికార్డులలో తన పుట్టిన తేదీని సవరించాలని కోరుతూ ఒక పిటిషనర్ దాఖలు చేసిన కేసును గుజరాత్ హైకోర్టు విచారిస్తోంది. దరఖాస్తుదారుడు తన పుట్టిన తేదీ 20 ఆగస్టు 1990 అని, ఇది అతడు పాఠశాల ధృవీకరణ పత్రం, పాన్, ఆధార్, పాస్పోర్ట్, ఎన్నికల కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ సహా అన్ని డాక్యుమెంట్లలో ఉన్న తేదీ ఇదేనని పేర్కొన్నారు. అయితే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) జారీ చేసిన అతడి జనన ధృవీకరణ పత్రంలో పుట్టిన తేదీ 16 ఆగస్టు 1990గా పేర్కొంది. ఇతర పత్రాలలో పేర్కొన్న తేదీకి సరిపోయేలా తన జనన ధృవీకరణ పత్రాన్ని సవరించమని ఏఎంసిని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించాడు. రెండు వైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు బెంచ్ జనన ధృవీకరణ పత్రంలో ఎటువంటి సవరణలు చేయడానికి వీలు లేదని నిరాకరించి పిటిషన్ను కొట్టివేసింది.
జనన మరణ రిజిస్ట్రేషన్ విభాగం జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం ఒక వ్యక్తి జనన తేదీకి అత్యంత విశ్వసనీయమైన అధికారిక రుజువు అని గుజరాత్ హైకోర్టు వెల్లడించింది. ఏఎంసి ధృవీకరించిన ఆసుపత్రి రికార్డులు పిటిషనర్ వాస్తవ జనన తేదీని 16 ఆగస్టు 1990గా నిర్ధారించాయని, ఇది జనన ధృవీకరణ పత్రంలోని ఎంట్రీతో సరిపోలిందని కోర్టు పేర్కొంది. దీనికి విరుద్ధంగా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, పాన్, పాస్పోర్ట్, ఎలక్షన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర పత్రాలు దరఖాస్తు సమయంలో పిటిషనర్ లేదా అతని కుటుంబం అందించిన సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. ఫలితంగా ఈ పత్రాలు సరైన పుట్టిన తేదీకి తుది రుజువుగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.
జనన ధృవీకరణ పత్రం ఆసుపత్రి రికార్డుల ఆధారంగా ఉంటుందని , ఇది ఒక వ్యక్తి పుట్టిన తేదీకి అధికారిక సోర్స్ అని కోర్టు ప్రకటించింది. అవసరమైతే ఇతర డాక్యుమెంట్లలో తేదీలను సవరించుకోవచ్చని హైకోర్టు సూచించింది. ప్రాథమిక వనరుగా జనన ధృవీకరణ పత్రం ప్రాముఖ్యతను ఈ తీర్పు స్పష్ఠం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు కోట్లాదిగా ప్రజలను టెన్షన్ పెడుతోంది. నిజానికి చాలా మంది పుట్టిన తేదీ ప్రూఫ్ గా ఆధార్ ని చూపెడుతున్నారు. కానీ ఇకపై కోర్టు తీర్పు ప్రకారం డివోబీకి ఆధార్, పాన్ చెల్లుబాటు కావు. ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు ఏవీ చెల్లుబాటు కావు. భారతదేశంలోని 143 కోట్ల మంది ప్రజలలో 90శాతం మందికి డివోబీ ఆధార్, జనన ధృవీకరణ పత్రం రెండిటిలో ఒకేలా ఉండదు. పదో తరగతి సర్టిఫికెట్ లో ఉన్నదే చాలావరకూ ఆధార్ లోను ఉంటుంది. ఇకపై కేవలం ఆస్పత్రి లో బర్త్ ప్రకారం... పుట్టిన తేదీ జనన ధృవీకరణ పత్రం ప్రకారం మాత్రమే నిర్ధారించాల్సి ఉంటుంది. అవసరం అయితే పదో తరగతి, ఆధార్ , పాన్, డ్రైవింగ్ లైసెన్సులలో బర్త్ డేట్ ని మార్చుకోవాల్సి ఉంటుంది.