TV9 లోగో నాది.. ₹168 కోట్లు నష్టపరిహారం కోరుతూ రవిప్రకాశ్ పిటిషన్
టీవీ9పై మరో పిటీషన్ ను ఢిల్లీ కోర్టులో దాఖలు చేసి వార్తల్లో నిలిచారు చానెల్ మాజీ సీఈవో రవిప్రకాష్.
By: Tupaki Desk | 1 March 2025 5:56 AM GMTటీవీ9పై మరో పిటీషన్ ను ఢిల్లీ కోర్టులో దాఖలు చేసి వార్తల్లో నిలిచారు చానెల్ మాజీ సీఈవో రవిప్రకాష్. TV9 లోగో వినియోగంపై తనకు నష్టపరిహారం అందించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCPL)తో టీవీ9 లోగో యాజమాన్యం విషయంలో రవిప్రకాష్ చట్టపరమైన పోరాటం మొదలుపెట్టారు.
- TV9 లోగోపై చట్టపరమైన పోరాటం
రవిప్రకాశ్ ట్విట్టర్లో తన పిటిషన్ను ధృవీకరిస్తూ "అవును, ఇది నిజం. నేను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాను. TV9 లోగో వినియోగానికి ₹168 కోట్లు నష్టపరిహారం.. దాన్ని వారు వాడకూడదని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాను’ అని ట్వీట్ చేశారు. కోర్టు ABCPLతోపాటు టీవీ9 అన్ని భాష చానెళ్లకు నోటీసు జారీ చేసి, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది," అని పేర్కొన్నారు.
-టీవీ9 నెట్ వర్క్ సమాధానం ఇదీ
అయితే TV9 నెట్వర్క్, ABCPL మాత్రం నాలుగు వారాల్లో ₹168 కోట్లు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు ప్రచారమవుతున్న వార్తలను ఖండించింది. ఇలాంటివి అసత్యాలని.. తప్పుదోవ పట్టించే వార్తలని స్పష్టం చేసింది.
- నిజాలు ఇవీ అంటున్న రవిప్రకాష్
తన ట్వీట్లో రవిప్రకాశ్, "నిజాలను మాత్రమే ప్రచారం చేద్దాం. కట్టుకథలు, చెల్లింపుల ద్వారా నడిచే కథనాలు, తగినట్లు మారుస్తున్న వక్రీకరణలకు చోటులేదు. కేసు ముందుకెళ్తోంది" అని స్పష్టం చేశారు. ఆసక్తికరంగా రవిప్రకాశ్ తన ట్వీట్లో "TV9 ఫౌండర్ & పార్ట్ నర్ (as of today)" అని పేర్కొన్నార. "Ex-TV9 CEO" అని ప్రస్తావించారు.
-రాజకీయ నేతలను ట్యాగ్ చేసిన రవిప్రకాష్
ఈ ట్వీట్లో రవిప్రకాశ్ పలువురు రాజకీయ నేతలను ట్యాగ్ చేశారు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మహారాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నవిస్ లను ట్యాగ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ హైకోర్టు ABCPLకు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో, ఈ చట్టపరమైన వ్యవహారం ఎలా మలుపుతీసుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది.