మాజీ ఎంపీకి జీవితఖైదు!
1984లో దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు విధిస్తూ దిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది
By: Tupaki Desk | 26 Feb 2025 12:30 AM GMT1984లో దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు విధిస్తూ దిల్లీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. సరస్వతీ విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్దీప్ సింగ్ను హత్య చేసిన కేసులో ఇటీవల దోషిగా తేలిన ఆయనకు శిక్ష ఖరారైంది.
కోర్టు తీర్పు ప్రకారం 1984లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్య అనంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో సజ్జన్ కుమార్ కేవలం పాలుపంచుకున్న వ్యక్తి మాత్రమే కాదని, అతడు ఒక బృందానికి నాయకత్వం వహించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ కేసులో ఆయన పాత్రను తీవ్రంగా పరిగణిస్తూ కోర్టు ఈ కఠినమైన శిక్ష విధించింది.
-ఇప్పటికే జైల్లో ఉన్న సజ్జన్
సిక్కు అల్లర్లకు సంబంధించిన మరో కేసులో కూడా సజ్జన్ కుమార్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. అంతేగాక, సిక్కులపై జరిగిన అల్లర్లకు సంబంధించి మరో రెండు కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థ నిందితులను శిక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టమైంది.
- 1984 అల్లర్ల నేపథ్యం
1984 అక్టోబర్ 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె సొంత భద్రతా సిబ్బందిలోని ఇద్దరు సిక్కు వ్యక్తులు హత్య చేయగా దేశవ్యాప్తంగా సిక్కులపై అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాకాండలో దిల్లీలో వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు రాజకీయ నాయకులు ఈ అల్లర్లకు ప్రేరేపించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిలో సజ్జన్ కుమార్ కూడా ఒకరు.
- న్యాయం జరిగిందంటున్న సిక్కులు
ఈ తీర్పు 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందన్న నమ్మకాన్ని ఇస్తోంది. సిక్కు సమాజం దీనిని ఆలస్యమైనా కానీ గెలుపుగా భావిస్తోంది. న్యాయస్థానం చేసిన ఈ తీర్పు ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయస్థానం మెరుగైన న్యాయవిచారణ అందించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ తీర్పుతో 1984 అల్లర్ల బాధితులకు తగిన న్యాయం జరిగినట్లు భావిస్తున్నప్పటికీ, ఇంకా పెండింగ్లో ఉన్న ఇతర కేసులపై కూడా త్వరగా తీర్పులు రావాలని బాధితుల కుటుంబాలు ఆశిస్తున్నారు.