Begin typing your search above and press return to search.

#MeToo నానా ప‌టేక‌ర్‌పై ముంబై కోర్టు సంచ‌ల‌న తీర్పు

సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న‌ను వేధించాడంటూ న‌టి త‌నూశ్రీ ద‌త్తా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 March 2025 3:02 PM IST
#MeToo నానా ప‌టేక‌ర్‌పై ముంబై కోర్టు సంచ‌ల‌న తీర్పు
X

సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న‌ను వేధించాడంటూ న‌టి త‌నూశ్రీ ద‌త్తా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న అభిమానులు, ఇత‌ర‌ యావ‌త్ ప్ర‌పంచం ఆశ్చ‌ర్య‌పోయింది. సీనియ‌ర్ న‌టుడు నిజంగా ఇలాంటి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారా? అంటూ షాక‌య్యారు. పైగా త‌నూశ్రీ ద‌త్తా ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెబుతున్నా దానికి స‌రైన ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో చాలా మంది దీనిని న‌మ్మ‌లేదు. ఇది వ్య‌క్తిగ‌త క‌క్ష సాధింపుగా దీనిపై ముంబై మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

తాజాగా ముంబై హైకోర్టు ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తాజా పరిణామం ప్ర‌కారం.. నానా పటేకర్ పై నటి తనుశ్రీ దత్తా చేసిన మీటూ ఆరోపణలను విచారణకు స్వీకరించడానికి ముంబై కోర్టు నిరాకరించింది. ఈ ఫిర్యాదు నిర్ణీత కాలపరిమితిలో ఇవ్వ‌లేదు.. అందువ‌ల్ల ఇది విచార‌ణ‌కు ఆమోద‌యోగ్యం కాద‌ని కోర్టు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. చ‌ట్ట ప్ర‌కారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే కోర్టు విచారించ‌గ‌ల‌దు.. ప‌దేళ్ల నాటి ఘ‌ట‌న‌ను విచారించ‌డం కుద‌ర‌ద‌ని ముంబై కోర్టు జ‌డ్జి తీర్పును వెలువ‌రించారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే...2018లో త‌నూశ్రీ నానాపై కేసు పెట్టింది. వాస్త‌వ ఘ‌ట‌న‌ 2008లో `హార్న్ ఓకే ప్లీజ్` సినిమా కోసం ఒక పాట చిత్రీకరణ సమయంలో జరిగినట్లు త‌నూశ్రీ దత్తా ఫిర్యాదులో పేర్కొంది. అక్టోబర్ 2018లో దాఖలు చేసిన తన ఫిర్యాదులో పాట‌ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ స‌హా అత‌డితో పాటు ఉన్న‌ మరో ముగ్గురు త‌నను వేధించార‌ని త‌నూశ్రీ‌ ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆకర్షించాయి. భారతదేశంలో #MeToo ఉద్యమంలో ఇది పెద్ద కుదుపు. త‌నూశ్రీ ద‌త్తా బ‌హిరంగ ఆరోప‌ణ‌ల త‌ర్వాత చాలా మంది క‌థానాయిక‌లు ఈ వేదిక‌పై త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌పై ఆరోపించారు.

అయితే నానా ప‌టేక‌ర్ పై విచార‌ణ‌లో ముంబై కోర్టు ఈ ఫిర్యాదును స్వీక‌రించ‌లేమ‌ని వ్యాఖ్యానించింది. ఫస్ట్ క్లాస్ (అంధేరి) జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎన్.వి. బన్సల్, ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత ఫిర్యాదు దాఖలు చేసార‌ని, ఇది భారతీయ‌ చట్టం ప్రకారం... కాలం ప‌రంగా పరిమితి దాటిపోయిందని పేర్కొన్నారు. భారత శిక్షాస్మృతి ప్రకారం, సెక్షన్లు 354 (నమ్రతను దెబ్బతీసే ఉద్దేశ్యంతో దాడి లేదా క్రిమినల్ బలవంతం), 509 (ఒక మహిళను అవమానించడం) రెండూ మూడు సంవత్సరాల పరిమితి కాలానికి లోబడి ఉంటాయి. క్రిమినల్ నేరాలపై సత్వర దర్యాప్తు, విచారణను నిర్ధారించడానికి పరిమితి కాలం చాలా కీలకమని కోర్టు నొక్కి చెప్పింది. ఫిర్యాదు ఎందుకు ఆల‌స్య‌మైందో వేగంగా ఎందుకు ఫిర్యాదు చేయ‌లేదో కూడా కోర్టు ప్ర‌శ్నించింది. స‌రైన కారణం లేకుండా ఇంతటి జాప్యాన్ని అనుమతించడం వల్ల సమానత్వం సూత్రాలు, చట్టం నిజమైన స్ఫూర్తి దెబ్బతింటుందని మేజిస్ట్రేట్ ఆందోళన వ్యక్తం చేశారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు 2019లో బి-సారాంశం రిపోర్ట్ ను దాఖలు చేశారు. కానీ వారి దర్యాప్తులో త‌నూశ్రీ‌ దత్తా వాదనలకు మద్దతు ఇచ్చే ఆధారాలు ఏవీ లభించలేదని పేర్కొన్నారు. పోలీసులు కూడా అది త‌ప్పుడు ఎఫ్ఐఆర్ అని తేల్చారు. దీనికి ప్రతిస్పందనగా త‌నూశ్రీ‌ దత్తా ఒక నిరసన పిటిషన్ దాఖలు చేస్తూ బి-సారాంశాన్ని తిరస్కరించాలని, త‌న‌ ఆరోపణలపై తదుపరి దర్యాప్తును కొనసాగించాలని కోర్టును కోరారు. అయితే ఈ విషయం చ‌ట్టానికి లోబడి లేద‌ని, ఈ కేసులో మరింత ముందుకు సాగలేమని కోర్టు తేల్చింది. ఈ తీర్పుతో త‌నూశ్రీ అబ‌ద్ధ‌పు వాద‌న‌ల‌ను కోర్టు అధికారికంగా ధృవీక‌రించిన‌ట్ట‌యింద‌ని ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్నేళ్ల త‌ర్వాత నానా ప‌టేక‌ర్ పై త‌నూశ్రీ‌ ఫిర్యాదు చేయ‌డం వెన‌క వేరే ఉద్ధేశాల‌ను కూడా నెటిజ‌నులు ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చిస్తున్నారు.