Begin typing your search above and press return to search.

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెనాలి అమ్మాయి దుర్మరణం

యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహామాలో ఎంఎస్ చేస్తున్న ఆమె.. ఎప్పటిలానే ఆదివారం తన డ్యూటీ పూర్తి చేసుకొని మిగిలిన వారితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు.

By:  Tupaki Desk   |   22 July 2024 4:36 AM GMT
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెనాలి అమ్మాయి దుర్మరణం
X

ఎలాంటి తప్పు లేకున్నా.. అమెరికాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన వైద్యురాలు ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన చోటు చేసుకుంది. అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు.. నాగమణి దంపతులకు ఒక కొడుకు.. ఒక కూతురు ఉన్నారు. కుమార్తె హారిక (24) వెటర్నరీ డాక్టర్ గా పట్టా అందుకున్నారు. అమెరికాలో ఎంఎస్ చేస్తూ.. పని చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఆమెరికాకు వెళ్లారు.

యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహామాలో ఎంఎస్ చేస్తున్న ఆమె.. ఎప్పటిలానే ఆదివారం తన డ్యూటీ పూర్తి చేసుకొని మిగిలిన వారితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు. హారిక వెనుక సీట్లో కూర్చున్నారు. వీరు వెళుతున్న కారు ముందు ఒక టూవీలర్ వ్యక్తి హటాత్తుగా కిందపడిపోవటంతో.. వీరి కారు సడన్ గా ఆపేశారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు వీరి కారును బలంగా ఢీ కొంది. అలా మొత్తం ఒకరి తర్వాత ఒకరు చొప్పున మూడు కార్లు ఢీ కొన్నాయి.

ఈ ప్రమాదంలో హారిక అక్కడికక్కడే మరణించారు. మిగిలిన వారు గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన హారిక సమాచారాన్ని తెనాలిలోని ఆమె తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించి విశ్వవిద్యాలయం. దీంతో.. వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తాజా విషాద ఉదంతం నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివ్రద్ధి, కమ్యునికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. హారిక తండ్రితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమార్తె మ్రతదేహాన్ని వీలైనంత త్వరగా తెప్పించాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించి.. ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.