Begin typing your search above and press return to search.

మనలో మనమాట.. బుర్ర ఉన్నోడు వాట్సప్ గ్రూపులో పెడతాడా?

By:  Tupaki Desk   |   11 May 2022 3:28 AM GMT
మనలో మనమాట.. బుర్ర ఉన్నోడు వాట్సప్ గ్రూపులో పెడతాడా?
X
నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు కమ్ ఏపీ మాజీ మంత్రి నారాయణను టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టు చేయటం.. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలించటం.. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చటం.. ఆపై జరిగిన వాదనలో నారాయణ మాష్టారు అసలు నారాయణ సంస్థల అధినేత పోస్టులో లేరని.. అప్పుడెప్పుడో 2014లోనే ఆయన తన విద్యా సంస్థల అధినేత పోస్టుకు రాజీనామా చేసిన విషయం బయటకొచ్చి.. ఆయనకు బెయిల్ లభించింది. దీంతో.. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణను ఎట్టి పరిస్థితుల్లో బొక్కలో వేయాలన్న లెక్క దారుణంగా తప్పినట్లైంది.

నిజానికి నారాయణను అరెస్టు చేయటంపై ఒక సెక్షన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తే.. మెజార్టీ సెక్షన్ ఆయన అరెస్టును తప్పు పట్టింది. అక్కడెక్కడో చిత్తూరుజిల్లాలో టెన్త్ క్లాస్ తెలుగు పేపర్ లీక్ కావటం ఏమిటి? దానికి నారాయణ సంస్థల వ్యవస్థాపకుడు కారణం కావటం ఏమిటి? ఆయన్ను అరెస్టు చేయటం ఏమిటి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసినోళ్లు బోలెడంత మంది ఉన్నారు.ఈ అరెస్టు ఎపిసోడ్ గురించి విన్నోళ్లంతా అడిగే ఒక ప్రశ్న.. బుర్రన్నోడు ఎవడైనా.. అది జగన్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రం లీకేజీకి వెళతాడా? వెళ్లటమే కాదు.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న పిచ్చ ఆలోచన చేస్తాడా?

న్యాయం.. ధర్మం లాంటివి ఏపీలోని ప్రభుత్వంలో ఇప్పుడెంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలిసిందే. అలాంటి చోట.. ఇలాంటి పాడు పని చేసే దమ్ము.. ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒకవేళ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలన్న కక్కుర్తి పడినా.. అందుకు తాను అరెస్టు అయ్యే అవకాశాన్ని ఏ ప్రముఖుడైనా ఇస్తారా? అన్నది మరో ప్రశ్నగా మారింది. మాల్ ప్రాక్టీసు ఘటనలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గిరిధర్ రెడ్డి.. సుధాకర్.. సురేష్ బాబు.. పవన్ కుమార్ రెడ్డిలను ఈ నెల 9న విచారించటం.. వారు పలు విషయాల్ని వెల్లడించటం ఒక ఎత్తు అయితే.. వారి అరెస్టును చూపే కన్నా.. ఈ లీకేజీతో ఏపీ సర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీశారన్న నేరానికి.. ఆ సంస్థల అధినేతగా (ఎవరికి వారు అనుకోవటమే కాదు.. వాస్తవం ఏమిటన్నది జడ్జి గారి ముందుకు వెళ్లినప్పుడు కానీ బయటకు రాలేదు) భావించిన నారాయణను హుటాహుటిన..యుద్ధ ప్రాతిపదికన అరెస్టు చేసే వరకు వెళ్లటం చూస్తే.. చట్టం ఇంత వేగంగా పని చేయటం అభినందనీయం.

పోలీసులు విచారించిన ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నిందితుల మాటల్నిఇక్కడ ప్రస్తావించాలి. తమ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మంచి మార్కులు రావాలనే ఈ చర్యకు పాల్పడినట్లుగా చెబుతూనే.. మరోవైపు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ‘చిత్తూరు టాకీస్’ వాట్సప్ గ్రూపులో ప్రశ్నాపత్రాన్ని పోస్టు చేసినట్లుగా గిరిధర్రెడ్డి.. ఇతర నిందితులు విచారణలో చెప్పినట్లుగా పేర్కొనటం కొత్త అనుమానాలకు తావిస్తోంది.

నలుగురు వ్యక్తులు చెప్పిన మాటతో అధికారులు ఆఘమేఘాల మీద అరెస్టు చేసేయటం చూసినప్పుడు.. ఎంత పెద్ద వ్యాపారవేత్త కానీ.. పారిశ్రామికవేత్త కానీ అరెస్టు కావటం ఎంత ఈజీనో అర్థం కాక మానదు. అయినా.. వ్యాపారం చేసేటోడు.. అది కూడా లాభాలు మాత్రమే తనకు ప్రధానమని భావించేటోళ్లు.. తమ దగ్గర చదివే పిల్లలకు నాలుగు మార్కులు ఎక్కువ రావాలని ఆశపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఆలోచన ఎందుకు చేస్తారు? ఒకవేళ అలాంటి ధైర్యమే చేస్తే.. అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న చిన్న లాజిక్ ను అంత పెద్ద విద్యా సంస్థల అధినేత మిస్ అవుతారా?