Begin typing your search above and press return to search.

అస‌మ్మ‌తి నేత గ‌ర్జిస్తే...అధిష్టానం షాకిచ్చింది

By:  Tupaki Desk   |   18 Sep 2017 10:09 AM GMT
అస‌మ్మ‌తి నేత గ‌ర్జిస్తే...అధిష్టానం షాకిచ్చింది
X
``తమిళనాడు సీఎం పళనిస్వామి జైలుకు వెళ్లటం ఖాయం....జైలుకు వెళ్లేది..చిప్ప‌కూడు తినేది ఆయ‌నే``అంటూ గంబీర ప్ర‌క‌ట‌న‌లు చేసిన అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ కు భారీ షాక్ త‌గిలింది. ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై వేటు ప‌డింది. పార్టీ విప్ దిక్కరించారంటూ దినకరన్‌ ను సపోర్ట్ చేస్తున్న 18 ఎమ్మెల్యేలపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేశారు. దీంతో త‌మిళ‌నాడు రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది.

ముఖ్య‌మంత్రి పళని స్వామి - మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాలు ఏకమై చిన్న‌మ్మ‌ శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించడంతో 19 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వైపు నిలిచారు. దీంతో పళని స్వామి ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ లేకుండా పోయింది. అయితే పళనిస్వామిని బల పరీక్షకు ఆహ్వానించాలని దినకరన్ తో పాటూ ప్రతిపక్షాలు గవర్నర్ ను ఎన్ని సార్లు కోరినప్పటికీ దీనిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. మ‌రోవైపు దిన‌క‌ర‌న్ త‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు దిగారు. సీఎం పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ మొదలుపెడితే చిప్పకూడు తప్పదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం తనకు లేదన్నారు. అసెంబ్లీలో బలపరీక్ష పెడితే పళనిస్వామికి ఎంత మంది మద్దతిస్తున్నారో తేలిపోతుందని దినకరన్ అన్నారు. ఇలా ఇరు వ‌ర్గాల మ‌ధ్య మాట‌ల స‌వాల్ సాగుతున్న స‌మ‌యంలోనే దిన‌క‌ర‌న్ వ‌ర్గం ఎమ్మెల్యేల‌పై వేటు ప‌డింది.

దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై స్పీక‌ర్‌ అనర్హత వేటు వేయడంతో పళని స్వామి శిబిరంలో ఉత్సాహ భ‌రిత వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే అన్నాడీఎంకే నుంచి సీఎం ప‌ళ‌నిస్వామిన వ్యతిరేకించే ఎమ్మెల్యేలు లేకుండా పోతారు. దీంతో ఆయ‌న పీఠం సుస్థిరంగా ఉంటుంది. మ‌రోవైపు తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో దినకరన్ పాండిచ్చెరీలో క్యాంప్ నిర్వహిస్తున్నారు. తాజా ప‌రిణామంతో ఆయా ఎమ్మెల్యేల‌తో భేటీ అయి త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటార‌ని స‌మాచారం.