Begin typing your search above and press return to search.

జమ్మూలో ఉగ్రదాడి, 27మంది జవాన్లు మృతి

By:  Tupaki Desk   |   14 Feb 2019 1:01 PM GMT
జమ్మూలో ఉగ్రదాడి, 27మంది జవాన్లు మృతి
X
జమ్మూలో అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 27 మంది సీఆర్‌ పీఎఫ్‌ బెటాలియన్‌ కు చెందిన జవాన్లు మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గత 20 ఏళ్లలో ఇంత పెద్ద ఉగ్రదాడి జరగలేదని జమ్మూ అధికారులు ప్రకటించారు. మరోవైపు ఉగ్రదాడిపై హోంమంత్రి రాజ్‌ నాథ్‌ అక్కడి అధికారులతో మాట్లాడారు.

జమ్మూ అండ్‌ శ్రీనగర్‌ లో ఈ మధ్యకాలంలో ఎలాంటి దాడులు జరగలేదు. ఒకటి అరా జరిగిన అవి చాలా చిన్నవి. కానీ ఇది మాత్రం పక్కా ప్లాన్‌ తో చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది. జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌ అవంతిపురా సమీపంలోకి రాగానే ఈ దాడి జరిగింది. కాన్వాయ్‌ లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. 2500 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్నట్లు సీఆర్పీఎఫ్‌ డీజీ ఆర్‌ ఆర్‌ భట్నాగర్‌ చెప్పారు.

జైషే మహ్మద్‌ కు చెందిన ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ దాదాపు 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారుతో సీఆర్ఫీఎఫ్‌ కాన్వాయ్‌ లోని ఓ బస్సును ఢీకొట్టాడు. దీంతో పెద్ద పేలుడుతో బస్సు తునాతునకలు అయిపోయింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 27మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు.. జమ్మూ అంతటా హై అలర్ట్‌ ప్రకటించారు.