Begin typing your search above and press return to search.

2000 నోట్ల క‌ట్ట‌ల‌ను వ‌దిలేసి చిల్ల‌ర ఎత్తుకెళ్లారు!

By:  Tupaki Desk   |   25 Aug 2017 4:14 PM GMT
2000 నోట్ల క‌ట్ట‌ల‌ను వ‌దిలేసి చిల్ల‌ర ఎత్తుకెళ్లారు!
X
కొద్దికాలం క్రితం వ‌చ్చిన ఓ సినిమాలో ``అప్ డేట్ అవ్వండ్రా...`` అంటూ ఎదుటివారి అమాయ‌క‌త్వం గురించి ప్ర‌ముఖ న‌టుడు చేసిన కామెంట్ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో డైలాగ్ ఇదిగో ఈ దొంగ‌ల‌కు బాగా సూట‌వుతుంది. ఎందుకంటారా?... బ్యాంకులో దొంగ‌త‌నం చేసేందుకు స్కెచ్ గీసుకొని..ప‌క‌డ్బందీగా లోప‌లికి చొర‌బ‌డి దొంగ‌త‌నం చేశారు. దొంగ‌లు దొంగ‌త‌నం చేయ‌క‌పోతే ఇంకేం చేస్తార‌నుకోకండి. అక్క‌డే ఉంది అస‌లు ట్విస్ట్‌. బ్యాంకులో 2000 క‌ట్ట‌లు చాలా ఉన్న‌ప్ప‌టికీ.. రూ. 5 - 10 బిల్ల‌ల‌ను దాదాపు 46 పాలిథీన్ బ్యాగుల్లో నింపుకొని మ‌రీ ఎత్తుకెళ్లారు. ఎందుకంటే....2000 నోట్ల లోప‌ల ఏదో చిప్ పెట్టార‌నుకొని ఎక్క‌డ దొరికిపోతామోన‌ని భ‌య‌ప‌డి వాటిని వ‌దిలేసి చిల్ల‌ర‌నంతా ఎత్తుకెళ్లారు ఈ తెలివి త‌క్కువ దొంగ‌లు.

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో గ‌త సోమ‌వారం జ‌రిగిన దోపిడి దొంగ‌లను ప‌ట్టుకోగా ఈ ఆస‌క్తిక‌ర‌మైన కామెడీ చోరుల విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. గ‌త న‌వంబ‌ర్ లో కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి రూ. 2000 నోటును ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు దాంట్లో మైక్రో చిప్ ను అమ‌ర్చింద‌ని.. సెన్సార్ ద్వారా ఆ నోటు ఎక్క‌డుందో తెలుసుకోవ‌చ్చ‌ని అప్ప‌ట్లో వార్త‌లు గుప్పుమ‌న్న సంగ‌తి తెలిసిందే. అదీ మ్యాట‌ర్‌. ఈ ముగ్గురు దొంగ‌లు అదే నిజ‌మ‌నుకొని న‌మ్మి... బ్యాంకులో చోరీకి వ‌చ్చిన స‌మ‌యంలో రూ. 2000 నోట్ల క‌ట్ట‌ల జోలికి పోకుండా.. దాదాపు రూ. 2.3 ల‌క్ష‌ల విలువ చేసే చిల్ల‌రను ఎత్తుకెళ్లారు. అయితే.. అక్క‌డి బస్ డిపో లో ప‌ని చేసే ఈ ముగ్గురు వ్య‌క్తుల‌పై అనుమానం క‌లిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించ‌గా అస‌లు త‌తంగం బ‌య‌ట‌ప‌డింది. దీంతో వాళ్లు ఎత్తుకెళ్లిన చిల్ల‌ర‌ను స్వాధీనం చేసుకొని వాళ్ల‌ను క‌ట‌క‌టాల్లోకి నెట్టారు పోలీసులు.

ముగ్గురు దొంగ‌ల అమాయ‌క‌త్వాన్ని చూసుకొని న‌వ్వుకుంటూనే...కొన్ని సార్లు అతి ప్ర‌చారం వ‌ల్ల కూడా ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉంటుంద‌ని కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.