Begin typing your search above and press return to search.

షాకింగ్ గా మారిన టైలర్ దగ్గరి కొత్త నోట్ల లెక్క

By:  Tupaki Desk   |   17 Dec 2016 10:35 AM GMT
షాకింగ్ గా మారిన టైలర్ దగ్గరి కొత్త నోట్ల లెక్క
X
ఓపక్క కొత్త నోట్ల కోసం కోట్లాది మంది కిందా మీదా పడుతుంటే.. మరికొందరికి మాత్రం కోట్లాది రూపాయిల కొత్త నోట్లు వచ్చేస్తున్న వైనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా వ్యవహరించిన శేఖర్ రెడ్డి దగ్గర వందల కోట్ల రూపాయిల కొత్త నోట్లను అధికారులు పట్టుకోవటం సంచలనం సృష్టించింది. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాంకుకు కూడా వెళ్లకుండా నేరుగా ఆయన ఇంటికి వెళ్లిపోయిన ఉదంతాన్ని వింటే జీర్ణించుకోవటం కష్టం.

ఏటీఎంలో వచ్చే రూ.2వేల కోసం కోట్లాది మంది దేశ వ్యాప్తంగా క్యూ లైన్లలో గంటల కొద్దీ వెయిట్ చేస్తుంటే.. శేఖర్ రెడ్డి లాంటి వారు కుర్చీ కదలకుండా కొత్త నోట్ల కట్టల్ని అంత భారీగా తెప్పించుకున్న ఉదంతాల మాదిరే పలు చోట్ల ఇలాంటివే చోటు చేసుకుంటున్నాయి. శేఖర్ రెడ్డి అంటే పారిశ్రామికవేత్త.. టీటీడీ బోర్డు సభ్యుడిగా.. రాజకీయంగా అంతో ఇంతో పలుకుబడి ఉన్నవాడు. కానీ.. ఒక సాదాసీదా టైలర్ దగ్గర కొత్త నోట్లు రూ.30 లక్షలు దొరకటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చండీగఢ్ లోని మెహాలీలోని సెక్టార్ 22కు చెందిన టైలర్ ఒకరి వద్ద ఈడీ అధికారులు రూ.30లక్షల కొత్తనోట్లను.. 2.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక వస్త్రవ్యాపారి నుంచి ఇదే తీరులో కొత్త నోట్లను రూ.2.19కోట్లను స్వాధీనం చేసుకున్న ఉదంతం మర్చిపోక ముందే.. ఇంత భారీ మొత్తం ఒక టైలర్ వద్ద లభించటం చూసినప్పుడు కోట్లాది మందికి సాధ్యం కానిది ఒక టైలర్ కు ఎలా సాధ్యమైందన్న సందేహం కలగక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/