Begin typing your search above and press return to search.

అమెరికా రోడ్లపై మనోళ్లు 50వేల మంది

By:  Tupaki Desk   |   5 Feb 2019 4:49 AM GMT
అమెరికా రోడ్లపై మనోళ్లు 50వేల మంది
X
అమెరికా స్వప్నం చెదురుతోంది. అక్రమంగా ఉంటున్న భారతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కక్షగట్టింది. తాజాగా ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో వందలాది మంది భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన అమెరికా సర్కారు.. తాజాగా ఫర్మింగ్ టన్ యూనివర్సిటీ తరహాలోనే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మరో ఐదు ప్రైవేటు వర్సిటీల్లో చోటు చేసుకున్న అక్రమ వ్యవహారాలతో వాటిని మూసివేయించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ వార్త తెలియడంతో అమెరికాలోని తెలుగు సంఘాలు, ప్రవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అమెరికాలో చదువు, ఉద్యోగం యావ తెలుగోళ్లకు మరీ ఎక్కువైంది. అందుకే ఆస్తులమ్మి, అప్పులు చేసి, బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మరీ అమెరికా పంపించేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లక పరిస్థితులు తలకిందలై ఏదో తెలియని యూనివర్సిటీల్లో విచారించకుండా చేరుతున్న విద్యార్థులు ఇలా చిక్కుల్లో పడిపోతున్నారు. అమెరికాలో వలసదారులు ఈనెల 5వ తేదీలోపు దేశం విడిచి వెళ్లిపోవాలని తాజాగా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అక్రమంగా ఉంటున్న విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

అమెరికాలో అక్రమంగా ఉంటున్న విద్యార్థులు, నిరుద్యోగులను గుర్తించే పనిలో హోంల్యాండ్ పోలీసులు ఉన్నారు. అందుకే నకిలీ ఫార్మింగ్టన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు గుంజారు. అనంతరం తాజాగా వందలాది మందిని జైలుకు పంపారు. ఫార్మింగ్టన్ పేరు ప్రాచుర్యంలోకి రాగానే మంచి యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఇందులోకి మారి ఇప్పుడు నిండా మునిగారు.

తాజాగా ఫార్మింగ్టన్ తరహాలోనే అక్రమాలకు పాల్పడ్డ మరో ఐదు విశ్వవిద్యాలయాలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయని.. కొన్ని రోజుల్లోనే ఈ విశ్వవిద్యాలయాలు మూసివేయడం ఖాయమని అమెరికాలో ప్రచారం జరుగుతోంది.

ఇక అమెరికా పోలీసులకు అనుమానం రావడానికి ప్రధాన కారణం ప్రైవేటు యూనివర్సిటీలు అడ్డదారులు తొక్కడమే.. భారతీయ విద్యార్థుల అమెరికా ఆశలను క్యాష్ చేసుకుందామని.. అమెరికా ప్రైవేటు వర్సిటీల ప్రతినిధులు ఇండియాలో రహస్యంగా ప్రవేశించి వివిధ రాష్ట్రాల్లో స్టార్ హోటళ్లలో విద్యార్థులను ఆకర్షించి మాయమాటలు చెప్పి సెమిస్టర్ కు రూ.10 నుంచి రూ20లక్షల ఫీజులతో ప్రవేశాలు కల్పించారు. ఈ విషయం అమెరికా పోలీసులకు తెలియడంతో ఈ గుట్టు బయటపడింది. భారతీయ విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు.

ఈ ఐదు తాజా నకిలీ యూనివర్సిటీల్లో దాదాపు 80వేల మంది విద్యనభ్యసిస్తున్నారని తేలింది. ఇందులో 50వేల మంది వరకు తెలుగు విద్యార్థులున్నారని అంచనా.. దీంతో వీరి భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉంది. అయితే ఆందోళన పెచ్చరిల్లుతుందని తెలిసి అమెరికా సర్కారు ఆ ఐదు యూనివర్సిటీల పేర్లు మాత్రం బయటపెట్టడం లేదు.