Begin typing your search above and press return to search.

షాకింగ్: 53మంది జర్నలిస్టులకు కరోనా

By:  Tupaki Desk   |   20 April 2020 3:30 PM GMT
షాకింగ్: 53మంది జర్నలిస్టులకు కరోనా
X
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికి సోకుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే సగం కేసులు వెలుగుచూశాయి.

తాజాగా ముంబై నగరంలో షాకింగ్ విషయం చోటుచేసుకుంది. నగరంలో పనిచేస్తున్న 53మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. ముంబై కార్పొరేషన్ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ జర్నలిస్టులు ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించకపోవడం వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది.

ఏప్రిల్ 16 -17 తేదీల్లో రిపోర్టర్లు - కెమెరామన్ లు కలుపుకొని మొత్తం 167మంది జర్నలిస్టులకు కరోనా పరీక్షలు చేశారు. వీరిలో ఏకంగా 53మందికి కరోనా సోకినట్లుగా తేలింది. దీంతో వారందరినీ క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారితో పనిచేసిన సహోద్యోగులకు పరీక్షలు చేస్తున్నారు.

కరోనా సోకిన వారంతా జర్నలిస్టులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ క్షేత్రస్థాయిలో వార్తలు సేకరించిన వారే. వారికే ఎక్కువగా సోకింది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 4203మందికి కరోనా సోకగా.. ఏకంగా 223మంది కరోనాతో చనిపోయారు. ఇప్పుడు జర్నలిస్టులకు ఈ వైరస్ సోకడం కలకలం రేపుతోంది.