Begin typing your search above and press return to search.

రగిలిన అసోం.. మిజోరం సరిహద్దు పంచాయితీ.. కాల్పులతో మరింత రచ్చ

By:  Tupaki Desk   |   27 July 2021 4:02 AM GMT
రగిలిన అసోం.. మిజోరం సరిహద్దు పంచాయితీ.. కాల్పులతో మరింత రచ్చ
X
ఈశాన్య రాష్ట్రాలైన అసోం.. మిజోరం మధ్య సరిహద్దు పంచాయితీ రచ్చ రచ్చగా మారింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు పంచాయితీ హద్దులు దాటేసి.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటమే కాదు.. స్థానికులు జరిపిన కాల్పుల్లో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు మృత్యువాత పడటం షాకింగ్ గా మారింది. ఈ వ్యవహారం కేంద్రానికి ఇప్పుడు తలనొప్పిగా మారింది. పరిస్థితి తీవ్రత స్థాయి పెరిగిపోయి విషమంగా మారినట్లు చెబుతున్నారు. సరిహద్దుల్లో చెలరేగిన హింస వేళ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విటర్ లో మాట పోరును మొదలు పెట్టారు. ఇద్దరు సీఎంలలో ఎవరూ తగ్గకుండా పోస్టులు పెట్టటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చినట్లు చెబుతున్నారు.

ఇంతకీ అంతలా గొడవ ఎందుకు జరిగినట్లు? అసలేమైంది? ఈ వివాదం ఇంత పెద్దది అయ్యే వరకు కేంద్రం ఏం చేస్తోంది? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అసోంకు.. మిజోరం రాష్ట్రాలకు మధ్య సరిహద్దు పంచాయితీ కొత్తదేం కాదు. చాలా పాతది. కొన్ని సంవత్సరాలుగా ఇది నడుస్తోంది. ఇప్పుడు ఇది మరింతగా ముదిరింది. దీనికి తోడుఇద్దరు ముఖ్యమంత్రులు.. ఒకరికి మరొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నట్లుగా ట్వీట్లు చేసుకోవటం కూడా సమస్య తీవ్రత ఎక్కువైందే కానీ తగ్గని పరిస్థితి.

అసలీ సమస్యకు కారణం వెతికితే.. ఈ రెండు రాష్ట్రాల మధ్య 164.6 కి.మీ. సరిహద్దు ఉంది. మిజోరంలోని ఐజ్వల్.. కొలాసిబ్.. మామిత్ జిల్లాలతో అసోంలోని కచార్.. హైలాకండి.. కరీంగంజ్ జిల్లాలకు సరిహద్దు ఉంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఉంది. తమ ప్రాంతంలోకి చొరబాటుకు పాల్పడుతున్నారంటూ అక్కడి ప్రభుత్వం.. ప్రజలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటాయి. అసోంకు ఒక్క మిజోరంతో మాత్రమే కాదు అరుణాచల్ ప్రదేశ్.. మేఘాలయతోనూ సరిహద్దు వివాదాలు ఉన్నాయి.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ వివాదంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశయ్యారు. వివాదం ఒక కొలిక్కి వస్తుందనుకున్న వేళలో తీవ్ర రూపం దాల్చి.. ఆరుగురు అసోం పోలీసులు బలి కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంతర్రాష్ట్ర తగాదా శాంతియుత వాతావరణంలో పరిష్కారం కావాలని మిజోరం కోరుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జొరామ్ తంగా కోరుకుంటున్నారు. తాజా వివాదానికి వస్తే.. సరిహద్దుల్లోని ఎనిమిది వ్యవసాయ క్షేత్రాలకు చెందిన పాకల్ని గర్తు తెలియని వారు తగలబెట్టారు. దీంతో ఘర్షణలు ఒక్కసారిగా పెరిగాయి. తాజా ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు మరణించగా.. ఒక ఎస్పీ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో అరవై మంది సిబ్బంది గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు.. వాహనాలు ధ్వంసమయ్యాయి.

దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది.దీనికి తోడుసమస్యను పరిష్కరించే కన్నా.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విటర్ లో మాటల యుద్ధానికి తెర తీశారు. సరిహద్దుల్లో భారీగా చేరిన ప్రజలు కర్రలు.. రాళ్లతో దాడి చేస్తున్న వీడియోను మిజోరం ముఖ్యమంత్రి ట్విటర్ లో పోస్టు చేశారు. దయచేసి ఈ వివాదాన్ని పరిష్కరించండి అంటూ వ్యాఖ్య చేశారు. ఈ పోస్టును ప్రధాని కార్యాలయంతో పాటు హోం మంత్రి కార్యాలయం.. అసోం ముఖ్యమంత్రికి.. ఆ రాష్ట్ర కచార్ పోలీసు శాఖకు కూడా ట్యాగ్ చేయటం గమనార్హం.

మిజోరం ముఖ్యమంత్రి ట్వీట్ కు స్పందించిన అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత రియాక్టు అవుతూ.. మిజోరం ప్రజలు ఎందుకిలా కర్రలు పట్టుకొని హింసకు దిగాలని చూస్తున్నారు? దీనిపై దర్యాప్తు చేయండి.. ప్రజలు ఇలా చట్టానని చేతుల్లోకి తీసుకోవద్దని కోరుతున్నామంటూ.. ఆయన కూడా మిజోరం ముఖ్యమంత్రి మాదిరే పలువురికి ట్యాగ్ చేశారు. ఇదిలా ఉంటే అసోం సీఎం మరో ట్వీట్ చేస్తూ.. తమ పోలీస్ పోస్టు నుంచి వైదొలగాలని మిజోరం రాష్ట్రానికి చెందిన కొలాసిబ్ ప్రాంత ఎస్పీ తమను కోరుతున్నారని.. అక్కడ మిజోరం ప్రజలు హింసను ఆపేది లేదంటున్నట్లుగా పేర్కొంటూ.. ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రభుత్వాన్ని ఎలా నడపగలం? అంటూ ప్రశ్నించారు.

ఈ ట్వీట్ కు మిజోరం ముఖ్యమంత్రి స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత కూడా రెండు కంపెనీల అసోం పోలీసులు.. ప్రజలు కలిసి తమ రాష్ట్రంలోకి ప్రవేశించి తమ ప్రజలపై లాఠీచార్జి చేయటంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. దీనికి అసోం ముఖ్యమంత్రి మరో ట్వీట్ చేస్తూ.. తాను ఇప్పుడే అమిత్ షాతో మాట్లాడనని.. సరిహద్దు వివాదంపై ఇప్పుడున్న పరిస్థితిని కొనసాగిస్తామని.. శాంతిని కొనసాగిస్తామన్నారు. దీనికి మిజోరం ముఖ్యమంత్రి స్పందించారు. ‘అలా అయితే అసోం పోలీసులు మిజోరం నుంచి వైదొలగాలి’ అని పేర్కొనటం గమనార్హం. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ ట్వీట్లను పోస్టు చేసే సందర్భంలో ఎవరికి వారు వారి వాదనలకు తగ్గట్లుగా సరిహద్దు ఉద్రిక్తలకు సంబంధించిన వీడియోల్ని పోస్టుచేయటం గమనార్హం.

మొత్తంగా చూస్తే.. ఎప్పటినుంచో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీ చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. ఆరుగురు పోలీసులు మరణించటం విషాదానికి గురి చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అసోంకు చెందిన పోలీసు బలగాలు.. వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ తరహా హింసకు అవకాశం లేకుండా కేంద్రం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు.