Begin typing your search above and press return to search.

ఖ‌త‌ర్నాక్ మోసం.. 903 కోట్ల హ‌వాలా సొమ్ము గుట్టుర‌ట్టు.. చైనా ముఠా అరెస్టు

By:  Tupaki Desk   |   13 Oct 2022 5:20 AM GMT
ఖ‌త‌ర్నాక్ మోసం.. 903 కోట్ల హ‌వాలా సొమ్ము గుట్టుర‌ట్టు.. చైనా ముఠా అరెస్టు
X
సుమారు 903 కోట్ల రూపాయ‌ల హ‌వాలా పెట్టుబ‌డుల మోసానికి సంబంధించిన గుట్టును హైద‌రాబాద్ పోలీసులు ర‌ట్టు చేశారు. పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో తీగ లాగితే డొంకంతా కదిలింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలిగించే ఓ చైనా హవాలా ముఠా పోలీసులకు చిక్కింది. ఢిల్లీ కేంద్రంగా మనీ ఎక్స్ఛేంజ్‌ పేరుతో దేశ వ్యాప్తంగా 900 కోట్ల రూపాయలకు పైగా మెసాలకు పాల్పడిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. మోసాల ద్వారా వచ్చిన సొమ్మును హవాలా, ఇతర మార్గాల్లో దేశం దాటిస్తున్నట్లు గుర్తించారు. వారి బ్యాంకు ఖాతాల్లోన్ని రూ.1.91 కోట్ల నగదును నిలిపివేయించారు. ఈ కేసులో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విష‌యం ఇదీ..హైదరాబాద్ తార్నాకకు చెందిన బాధితుడు తనకు వచ్చిన సందేశానికి స్పందించి లింక్ను క్లిక్ చేశారు. దాని ద్వారా ఓ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయ్యారు. ఆ గ్రూప్లో పలు కంపనీల్లో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ ప్రకటనలు చూసి స్పందించారు. జూలై నెలలో 'లాక్సమ్' అనే పెట్టుబడులు యాప్లో వస్తువులు అన్‌లైన్ కొనుగోలు చేస్తే వాటికి రెండింతలు డబ్బు వస్తుందని చెప్పారు.

అది నమ్మి విడతల వారీగా 1.6 లక్షల రూపాయల వస్తువులు కొన్నారు. డబ్బు విత్‌ డ్రా చేసుకోవాలంటే మరి కొంత డబ్బు కట్టాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట బాధితుడు నగదు జమ చేసి సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించారు.

ఇలా దేశ వ్యాప్తంగా పలువురి నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని బ్యాంకు ఖాతా గ్జిందయ్‌ టెక్నాలజీస్ ప్రైవేట్ పేరుతో విరేదర్ సింగ్ అనే వ్యక్తి తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించగా చైనాకు చెందిన జాక్ అనే వ్యక్తి ఆదేశాల మేరకు ఖాతా తెరిచినట్లు చెప్పాడు.

అనంతరం ఆ బ్యాంకు ఖాతా అన్‌లైన్ బ్యాంకింగ్ ఐడీ, పాస్వర్డ్లు జాక్కు ఇచ్చానని వెల్లడించాడు. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు వీరేందర్ తెరిచిన ఖాతాకు అనుసంధానంగా ఉన్న ఫోన్‌ నంబరు బెన్‌టెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు మరో ఖాతా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఖాతాను ఢిల్లీ కి చెందిన సంజయ్ కుమార్ తెరిచనట్లు తేలింది. ఈ ఖాతా కూడా చైనాకు చెందిన లీ ఝౌంజావ్ ఆదేశాలతో తెరిచానని చెప్పాడు.

ఇలా పలు ఫోన్‌ నంబర్లపై 15 ఖాతాలు తెరిచారు. వీటన్నింటిని ఆన్‌లైన్ బ్యాంకిగ్ వివరాలు ముంబయిలో ఉంటున్న చైనా దేశస్తుడు చు చున్‌-యుకి పంపిస్తున్నారు. ఇలా ఖాతాలు సమకూర్చినందుకు సంజయ్‌, వీరేందర్ లు ఒక్కో ఖాతాకు రూ.1.2 లక్షలు కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ బ్యాంకిగ్ వివరాలతో గ్జిందాయ్‌ టెక్నాలజీ చెందిన ఖాతాల్లో జమ అయిన నగదును 38 ఖాతాలకు బదిలీ చేశారు.

ఈ 38 ఖాతాల్లో హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు సమకూర్చిన రెండు ఖాతాలు కూడా ఉన్నాయి. ఇందుకు కమీషన్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 38 ఖాతాల్లోని నగదు ఢిల్లీలోని నవనీత్ అనే నిందితుడికి చెందిన రంజన్ మనీ కార్పోరేషన్, కేడీఎస్‌ ఫారెక్స్‌ అనే రెండు ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ కంపెనీలకు బదిలీ అయ్యాయి. ఇవీ ఆర్బీఐ నుంచి అనుమని తీసుకుని నడుపుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

నవనీత్ ఈ రెండు ఎక్స్ఛేంజ్‌ కంపెనీలను ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో నడుపుతున్నాడు. ఇవి కూడా అర్బీఐ అనుమతి తీసుకుని నడిపిస్తున్నట్లు గుర్తించారు. నవనీత్ ఇండియన్ కరెన్సీని డాలర్లుగా మార్చి వాటిని సాహిల్, సన్నీలకు ఇస్తున్నాడు. వీరిద్దరూ ఈ డబ్బును చైనా దేశస్థులకు హవాలా రూపంలో పంపిస్తున్నారు.

కొంత డబ్బును ఖాతాలను అనుసంధానంగా ఉన్న సిమ్‌ కార్డులు.. అన్‌లైన్ బ్యాంకింగ్ ఐడీ పాస్వర్డ్ల ద్వారా చు చున్‌-యూ కంబోడియాకు కొరియర్లో పంపిస్తాడు. అక్కడి తమ కార్యాలయం ద్వారా నగదును చైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తేలింది. చైనాలో ఉన్న ప్రధాన సూత్రధారులు పీ, హువాన్ జుహాన్లు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆర్బీఐ నిబంధలను అతిక్రమించి ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ మాటున నగదును దేశం దాటిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

లీ ఝౌంజావ్ ఢిల్లీలోని ఓ ఎలక్ట్రానిక్ షాపు నడుపుతూ ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరో చు చున్‌ యు అనే వ్యక్తి పాస్పోర్ట్ గడువు ముగియడంతో ముంబై పోలీసులు విచారిస్తుండగా.. హైదరాబాద్ పోలీసులు కోర్టులో హాజరు పరిచి నగరానికి తీసుకొచ్చారు. ఇలా రంజన్ మనీ కార్పోరేషన్ నుంచి ఏడు నెలలలోనే 441 కోట్ల రూపాయల నగదు బదిలీ అయినట్లు గుర్తించారు.

కేడీఎస్‌ ఫారెక్స్ నుంచి రూ.462 కోట్ల లావాదేవీలు చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మనీలాండరింగ్ ఆర్బీఐ నిబంధనల అతిక్రమణ, ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు అతిక్రమించినట్లు పోలీసులు తెలిపారు. కేసు వివరాలను దర్యాప్తు సంస్థలకు అందజేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ముఠా దేశ వ్యాప్తంగా మోసాలు చేసినట్లు గుర్తించారు.

ఇప్పటి వరకు విడతల వారిగా ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేయగా కస్టడీలో పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. చైనా దేశస్తులు చు చున్‌-యు, లీ ఝౌంజావ్లతో పాటు ఢిల్లీకి చెందిన షాహిల్ బజాజ్‌, సన్నీ, వీరేందర్ సింగ్, సంజయ్ యాదవ్, నవనీత్లు.. హైదరాబాద్ నుంచి ఖాతాలు సమకూర్చిన మహ్మద్ ఫర్వేజ్, సయ్యద్ సుల్తాన్, మీర్జా నదీమ్లను ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి 17 సెల్ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, 3 పాస్‌పోర్టులు, ఎటిఎం కార్డులు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు బ్యాంకు ఖాతాల్లోని 1.91 కోట్ల రూపాయల నగదును నిలపుదల చేశారు.

కంబోడియాలో కేంద్రం ఏర్పాటు చేసుకొని చైనా వాళ్లు పనిచేస్తున్నారు. ఈ డబ్బు చైనాకు వెళుతుంది. రూ.900 కోట్ల మోసానికి పాల్పడ్డారు. వర్చువల్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లను తెరుస్తారు. వర్చువల్ అకౌంట్లు ఏటంటే బ్యాంకింగ్ మించి పనిచేస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించే విధంగా ఈకేసు ఉంది అని సీవీ ఆనంద్ చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.