Begin typing your search above and press return to search.

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.. అఖిలేష్‌ సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   17 May 2023 11:36 AM GMT
దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.. అఖిలేష్‌ సంచలన నిర్ణయం!
X
దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో జట్టు కట్టేందుకు ప్రధాన పార్టీలన్నీ ముందుకు వస్తున్నాయి. కాంగ్రెస్‌ ను పక్కనపెట్టి థర్డ్‌ ఫ్రంట్‌ సాధ్యం కాదనే అభిప్రాయంతోనే మెజారిటీ పార్టీల నేతలు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అన్ని పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో కలసి నడవాల్సిన అవసరాన్ని ఆయన అన్ని పార్టీలకు వివరిస్తున్నారు. ఇటీవల ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ తదితరులను కాంగ్రెస్‌ కు అనుకూలంగా ఉండేలా నితీష్‌ కుమార్‌ మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.

నితీష్‌ కుమార్‌ మంతనాలతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీకే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రతిపాదనకు సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ కూడా అంగీకరించారు.

కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీకే మద్దతు ఇస్తామని అఖిలేష్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈ మేరకు మమతా బెనర్జీ చేసిన ప్రతిపాదనకు తాను అంగీకరిస్తున్నానన్నారు. అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌ వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడంతో ఉత్తర ప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ బలంగా ఉన్న అమేథి, రాయబరేలి, సుల్తాన్‌ పూర్‌ వంటి స్థానాలతోపాటు పలు స్థానాల్లో కాంగ్రెస్‌ కు ఎస్పీ మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక దేశంలోనూ పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట ఆ పార్టీకే సమాజ్‌ వాదీ పార్టీ మద్దతు ప్రకటించనుంది.

ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీకి అఖిలేష్‌ యాదవ్‌ తాజా నిర్ణయం గొప్ప ఊరటగా విశ్లేషకులు భావిస్తున్నారు.

తానొక్కడినే కాకుండా బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైతం ఇదే వైఖరితో ఉన్నారని అఖిలేష్‌ యాదవ్‌ చెప్పడం గమనార్హం. మొత్తం మీద బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తుండటం కాంగ్రెస్‌ పార్టీకి లాభం చేకూరుస్తుందని అంటున్నారు.