Begin typing your search above and press return to search.

బీజేపీని దారిత‌ప్పించిన ఈటల నోటి దూల‌!

By:  Tupaki Desk   |   22 April 2023 3:06 PM GMT
బీజేపీని దారిత‌ప్పించిన ఈటల నోటి దూల‌!
X
తెలంగాణ బీజేపీ వ్యూహం ఏంటి? ఆ పార్టీ ఏ ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది? అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో అధికార పార్టీపై దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పాద‌యాత్ర‌లు, స‌భ‌లు స‌మావేశాలు పెట్టి బీఆర్ ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అనేలా రాజ‌కీయాల‌ను పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్లింది. అయితే.. పాన‌కంలో పుడ‌క మాదిరిగా అనూహ్యంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు పార్టీని ట్రాక్ మ‌ళ్లించాయి.

మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ నుంచి కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ముట్టాయంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈటల చేసిన ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు బీజేపీని ఎండ‌గ‌డుతున్నారు. ఈట‌ల వ్యాఖ్యలపై భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణానికి రావాలంటూ రేవంత్ సవాల్ విసిరిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ఈట‌ల ఇంకా రియాక్ట్ కాలేదు.

అయితే.. ఇంత‌లోనే మ‌రింత మంది కాంగ్రెస్ నేత‌లు.. ఈట‌లను ల‌క్ష్యంగా చేసుకుని కామెంట్ల‌తో కుమ్మేశారు. ఈటల భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రాకుంటే రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపడుతుందనే భయం బీజేపీ నేతల్లో కనిపిస్తోందని మ‌రికొంద‌రు చెబుతున్నారు.

ఈటల అవగాహన లేమితో, ఫ్రస్టేషన్‌తో చేసిన వాఖ్యలపై బీజేపీ స‌మాధానం చెప్పాల‌ని కొంద‌రు డిమాండ్ చేశారు.

రూ.18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్ రెడ్డిని కొన్నారని కొంద‌రు విమర్శించారు. ఈటల ఆరోపణలు నిజమైతే.. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలని కాంగ్రెస్ నేత‌లు స‌వాల్ రువ్వారు. దమ్ముంటే ఈటల భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని మరో కాంగ్రెస్ నేత సవాల్ చేశారు.

బుల్డోజర్ పెట్టి లేపినా బీజేపీ లేవదని యెద్దేవా చేశారు. మోడీ, అమిత్ షా‌ దగ్గర మార్కులు కొట్టేందుకే ఈటల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తంగా చూస్తే.. బీజేపీ నేత‌లు ప్ర‌శాంతంగా చేసుకుంటున్న విమ‌ర్శ‌లు, యుద్ధంలో ఈటల చేసిన వ్యాఖ్య‌లు.. ఆ పార్టీకి మైన‌స్‌గా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.