Begin typing your search above and press return to search.

పెట్రోల్ లో మిథనాల్‌ కలిపితే మరింత తక్కువకే !

By:  Tupaki Desk   |   9 Nov 2021 12:30 AM GMT
పెట్రోల్ లో మిథనాల్‌ కలిపితే మరింత తక్కువకే  !
X
పెట్రోల్, డీజల్ ధరలు దేశంలో ఎలా భగ్గుమంటున్నాయి చెప్పాల్సిన పనేలేదు. అయితే తాజాగా కేంద్రం పెట్రోల్ , డీజల్ ధరలని తగ్గించింది. పెట్రోలులో 15 శాతం మిథనాల్‌ కలిపితే, ఇప్పుడున్న ధరను లీటరుకు రూ.6-7 వరకు తగ్గించవచ్చని ప్రముఖ శాస్త్రవేత్త, నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.సారస్వత్‌ పేర్కొన్నారు. ఎల్‌ పీజీ లో 20 శాతం డీఎంఈని కలిపితే దాని ధర కూడా బాగా తగ్గుతుందన్నారు. అమరావతిలోని ఎస్‌ ఆర్‌ ఎం యూనివర్సిటీ రీసెర్చ్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం చేపట్టిన హైడ్రోజన్‌, మిథనాల్‌ ఎకానమీ ప్రాజెక్టులతోపాటు, విద్యుత్‌ వాహనాల వినియోగం పెంపునకు కృషి, హైపర్‌ లూప్‌ సహా వివిధ అంశాలపై మాట్లాడారు.

ప్రస్తుతం పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ కలుపుతున్నాం. 2030 నాటికి దాన్ని 20 శాతానికి పెంచాలన్నది లక్ష్యం. దానికి సమాంతరంగా మిథనాల్‌ ను ప్రత్యామ్నాయ ఇంధనంగా ప్రోత్సహించేందుకు నీతిఆయోగ్‌ భారీ కార్యక్రమం చేపట్టింది. మిథనాల్‌ ను 5 నుంచి 15 శాతం కలపొచ్చు. మిథనాల్‌ ధర కిలో రూ.25-30 ఉంటుంది. పెట్రోల్‌ లో 15 శాతం మిథనాల్‌ కలిపితే, లీటరు ధరలో కనీసం రూ.6 తగ్గుతుంది. పైగా కర్బన ఉద్గారాలు 35 శాతం తగ్గుతాయి. మిథనాల్‌ ను డీహైడ్రేట్‌ చేస్తే డీఎంఈ అవుతుంది. దాన్ని కలిపి, ఎల్‌ పీజీ ధరను తగ్గించొచ్చు. ఎం15 పేరుతో పెట్రోల్‌లో మిథనాల్‌ కలిపే ప్రాజెక్టును వచ్చే జనవరిలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సహజ వాయువు నుంచి మిథనాల్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్లే దేశంలో ఉన్నాయి. మన దేశంలో విస్తారంగా దొరికే, బూడిద శాతం ఎక్కువగా ఉన్న బొగ్గు నుంచి మిథనాల్‌ ఉత్పత్తి చేసే విధానాన్ని హైదరాబాద్‌ లోని బీహెచ్‌ఈఎల్‌ రూపొందించింది.

అక్కడో పైలట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీ 4.0 ప్రోగ్రాంలో భాగంగా.. పారిశ్రామికరంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, డేటా మైనింగ్‌, ఆటోమేషన్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని పెంచడంపై నీతిఆయోగ్‌ విశేష కృషి చేస్తోంది. ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలు పోతాయన్న అపోహ చాలామందిలో ఉంది. ఇది వరకు శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నచోట, ఇప్పుడు మేథతోనూ, సృజనతోనూ పని చేయాల్సి వస్తుందే తప్ప, నిరుద్యోగం పెరుగుతుందన్నది సరికాదు. భారత్‌ను 2070 నాటికి నెట్‌ జీరో కార్బన్‌ దేశంగా మార్చుతామని, 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని 500 గిగావాట్లకు పెంచుతామని కాప్‌-26 సమావేశాల్లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దీని వెనుక చాలా కసరత్తు జరిగింది. 2050 నాటికి దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం గణనీయంగా తగ్గుతుంది. రాబోయే రోజుల్లో హైడ్రోజన్‌ ప్రధాన ఇంధన వాహకంగా మారుతుంది.

దేశంలో ప్రస్తుతం 65-70 శాతం విద్యుత్‌ థర్మల్‌ ప్లాంట్లలోనే ఉత్పత్తవుతోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 40 గిగావాట్లు మాత్రమే వస్తోంది. దీన్ని 175 గిగావాట్లకు చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కానీ మన అవసరాలకు 370- 380 గిగావాట్ల విద్యుత్‌ కావాలి. దేశం అభివృద్ధి చెందే కొద్దీ ఇంధన అవసరాలు మరింత పెరుగుతాయి. దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు ఫేమ్‌-2 పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలిస్తోంది. ప్రస్తుతం ఆ వాహనాల్లో వాడే పవర్‌ ప్యాక్‌ ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఐఎల్‌ స్కీం) పెట్టింది. ప్రస్తుతం దేశంలోని సంస్థలు లిథియం అయాన్‌ సెల్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని బ్యాటరీలు తయారుచేస్తున్నాయి. వాటి దిగుమతులు తగ్గించేందుకు కృషి జరుగుతోంది. దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలు సోలార్‌, లిథియం అయాన్‌ ప్లాంటు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ద్వి, త్రిచక్ర వాహనాల్లో బ్యాటరీలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి బ్యాటరీ డౌన్‌ అయితే వాటిని మార్చి, కొత్తవి అమర్చుకోవడం చాలా తేలిక. వాటికి ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరం లేదు.

హైపర్‌ లూప్‌ టెక్నాలజీ అభివృద్ధి పై నా ఆధ్వర్యంలో ఒక కమిటీ అధ్యయనం చేస్తోంది. వర్జిన్‌ హైపర్‌లూప్‌ అనే విదేశీ సంస్థ మహారాష్ట్ర, కర్ణాటకల్లో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు చేపడతామని ఆ రాష్ట్ర ప్రభుత్వాల్ని గతంలో సంప్రదించింది. వారి టెక్నాలజీని మా కమిటీ పరిశీలించింది. అదింకా అభివృద్ధి చేసే దశలోనే ఉంది. హైపర్‌ లూప్‌ కచ్చితంగా సాధ్యమయ్యే ప్రాజెక్టే. కాకపోతే వ్యాక్యూమ్‌ ట్యూబ్‌ లో గంటకు 800-900 కి.మీ.ల వేగంతో ప్రయాణించేటప్పుడు భద్రతాపరంగా చాలా అంశాలు చూసుకోవాలి. ఆ టెక్నాలజీ భవిష్యత్తులో కచ్చితంగా అందుబాటులోకి వస్తోంది. హైపర్‌ లూప్‌ సాంకేతికతలో మన దేశమే లీడర్‌ గా ఉండాలన్నది లక్ష్యం.