Begin typing your search above and press return to search.

పార్టీ మారింది కాక‌.. ఇంత క‌క్ష క‌డ‌తావా?

By:  Tupaki Desk   |   6 Jun 2023 12:44 PM GMT
పార్టీ మారింది కాక‌.. ఇంత క‌క్ష క‌డ‌తావా?
X
గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే, టీడీపీ టికెట్‌పై గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ పై టీడీపీ నాయ‌కులు నిప్పులు చెరుగుతున్నారు. రాజ‌కీయం నేర్పిన పార్టీపైనే క‌క్ష క‌ట్టిన‌ట్టు వంశీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వారు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. రాజకీయ కక్షతోనే గన్నవరం మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరావు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే వంశీపై టీడీపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్నారు.

టీడీపీ నేత‌లు చెప్పిన వివ‌రాల మేర‌కు..

టీడీపీ గ‌న్న‌వ‌రం ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జాస్తి వెంక‌టేశ్వ‌ర‌రావుకు కృష్ణా జిల్లా వెదురుపావులూరులో సర్వేనెంబరు 308/4లో 99 సెంట్ల పొలం ఉంది. ఇది డి పట్టా. దీనిని 1999లో జాస్తి రాజేశ్వరమ్మ పేరుతో వెంకటేశ్వరరావు తల్లికి ప్రభుత్వం ఇచ్చింది. వారసత్వం ప్రకారం తల్లి నుంచి ఆయనకు సంక్రమించింది. రెవెన్యూ అధికారులే వెంకటేశ్వరరావు పేరిట మార్చారు.

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. అధికారాన్ని ప్రయోగించి పలువురిని తనవైపు తిప్పుకొనేందుకు యత్నించగా వెంకటేశ్వరావు వెళ్లలేదని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. దీంతో ఈ డి-ఫారం పట్టాను తెరపైకి తెచ్చారు. ఈ స్థలం విజయవాడ బైపాస్‌ పక్కనే ఉండగా కూరగాయలు సాగు చేస్తున్నారు. దీనిని స్వాధీనం చేసుకోవాలనే ఒత్తిడి పెరిగింది.

మే 18న జాస్తి భూమిలోకి ఎమ్మెల్యే వంశీ మందీమార్బలంతో వెళ్లారని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అనీ, స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. దీనిపై అప్పటికే హైకోర్టు ఇన్‌జక్షన్‌ ఆర్డరు ఉందని, హైకోర్టు న్యాయపరంగా వెళ్లాలని ఆదేశాలిచ్చి పిటిషన్‌ను మూసివేసిందని చెబుతున్నారు. ప్రస్తుతం న్యాయస్థానాలకు వేసవి సెలవులు కావడంతో ఆ అవకాశం లేకుండా కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడం, నాలుగో తేదీనే తహసీల్దార్‌ వాటిని జారీ చేయడం, వెనువెంట‌నే భూమిని స్వాధీనం చేసుకున్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.