Begin typing your search above and press return to search.

విజ‌య‌న్ ప్ర‌భుత్వాన్ని చూస్తే.. నాకే సిగ్గేస్తోంది: గ‌వ‌ర్న‌ర్ ఫైర్‌

By:  Tupaki Desk   |   23 Oct 2022 1:49 PM IST
విజ‌య‌న్ ప్ర‌భుత్వాన్ని చూస్తే.. నాకే సిగ్గేస్తోంది:  గ‌వ‌ర్న‌ర్ ఫైర్‌
X
గత కొంతకాలంగా కేరళ సర్కారుకు, గవర్నర్‌కు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఈ తరుణంలోనే ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌. కేరళలోని ఎల్డీఎఫ్‌ సర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మద్యం, లాటరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు. ఇది వింటుంటే తనకే సిగ్గుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌కు అడ్డాగా ఉన్న పంజాబ్‌ను త్వరలోనే కేరళ దాటేయబోతోందని వ్యాఖ్యానించారు.

``మ‌ద్యం అమ్మి.. లాట‌రీలు ఆడి.. ప్ర‌భుత్వాల‌ను న‌డిపిస్తారా?.. ఇది చాలాసిగ్గు చేటు.. `` అని గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా పినరయి విజయన్‌ సర్కారు, గవర్నర్‌కు మధ్య ఘర్షణాపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గవర్నర్‌ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అన్ని చోట్లా మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్నే ఓ ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు.

'నూరు శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి సిగ్గుచేటు. రాష్ట్రంలో మద్యం, లాటరీని ప్రధాన ఆదాయ వనరులుగా చూస్తున్నారు. ఇలాంటి రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనందుకు నాకు సిగ్గుగా అనిపిస్తోంది. అసలు ఈ లాటరీలేంటి? పేద ప్రజలు లాటరీ టికెట్లు కొంటే ఇక్కడ కూర్చుని మీరు డబ్బులు లెక్క పెట్టుకుంటారా? లాటరీ పేరు చెప్పి ప్రజల్ని దోచుకుంటున్నారు. ప్రజల్ని మద్యానికి బానిసలుగా చేస్తున్నారు' అంటూ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్య పానానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన చోట.. మద్యం తాగాలని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మ‌రి దీనిపై కామ్రెడ్ సీఎం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.