Begin typing your search above and press return to search.

చంద్రబాబు పిలిచిన రాని మహిళా నేత.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్..!

By:  Tupaki Desk   |   1 Nov 2019 10:30 AM GMT
చంద్రబాబు పిలిచిన రాని మహిళా నేత.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్..!
X
ఆంధ్రప్రదేశ్‌ లో ఆసక్తికర రాజకీయాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా... భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో జనసేన సైతం తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇక, ప్రభుత్వంపై అసమ్మతి అనేదే లేకుండా చూసుకోవాలని అధికార పార్టీ అనుకుంటోంది. ఇందులో భాగంగానే ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతూ ముందుకు వెళ్తోంది. ఇన్ని పార్టీలు - ఎంతో మంది నాయకుల హడావిడి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా నేత మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా నేత..? ఎందుకు చర్చనీయాంశం అవుతున్నారు..?

ఆమె మరెవరో కాదు.. ప్రముఖ నటుడు - మాజీ ఎంపీ మురళీ మోహన్ కోడలు మాగంటి రూపా దేవి. కొద్ది రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ఈమెకు చేదు అనుభవం ఎదురైంది. తన మామ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసిన రూపా దేవి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్గాని భరత్‌ పై లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక, అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంతేందుకు చంద్రబాబు నిర్వహించిన పార్టీ సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు. దీంతో అందరూ ఈమె గురించి చర్చించుకుంటున్నారు.

వాస్తవానికి రూపా దేవి.. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా అప్పటి ఎంపీ మురళీ మోహన్ దత్తత తీసుకున్న గ్రామాల్లోనూ రూపాదేవి పర్యటించారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. ఇలా తనదైన వ్యవహారశైలితో రూపాదేవి అందరినీ ఆకర్షించారు. ఈ తరుణంలోనే మురళీమోహన్ వారసురాలిగా రూపాదేవి రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వినిపించాయి. దీనికితోడు మురళీమోహన్ పోటీ చేయనని అధినేతకు చెప్పడంతో రూపాదేవికి టికెట్ కన్ఫార్మ్ చేశారు టీడీపీ అధినేత.