Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద‌ అంబేద్క‌ర్ విగ్ర‌హం.. ఈ విశేషాలు తెలుసుకోవాల్సిందే!

By:  Tupaki Desk   |   7 April 2023 9:00 AM GMT
హైద‌రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద‌ అంబేద్క‌ర్ విగ్ర‌హం.. ఈ విశేషాలు తెలుసుకోవాల్సిందే!
X
శిల‌ల‌పై శిల్పాలు చెక్కినారు.. మ‌న వాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..  అంటూ సినిమాలో పాట‌లాగానే.. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్క‌ర్ విగ్ర‌హంతో హైద‌రాబాద్ అందాలు మ‌రింత‌గా పెరగ‌ను న్నాయి. ఈ నెల 14న దేశంలోనే అతి పెద్ద అంబేద్క‌ర్ విగ్ర‌హం(ఏపీలోనూ ఇదే ఎత్తుతో త‌యారు చేస్తు న్నారు)  హైద‌రాబాద్‌లోని హుస్సేన్ సాగ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కం గా భావించిన ఈ విగ్ర‌హ ఏర్పాటుకు.. ఏడేళ్ల  కింద‌టే శ్రీకారం చుట్టారు.

ఇప్ప‌టికే ట్యాంక్ బండ్‌ వద్ద ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మించారు. దీనిలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఆ పక్కనే మ్యూజి యం, సమావేశ మందిరం కూడా నిర్మించారు.

విగ్ర‌హం డైమ‌న్ష‌న్స్.. ఇవీ..
+ ఎత్తు 125 అడుగులు
+ వినియోగించిన స్టీల్ :  791 ట‌న్నులు
+ ఇత్త‌డి : 96 ట‌న్నులు
+ ప‌నిచేసిన సిబ్బంది: 425
+ బేస్‌మెంట్ ఎత్తు : 50 అడుగులు
+ బేస్‌మెంట్ వెడల్పు:  45 అడుగులు
+ ప్రాజెక్టు వ్యయం రూ.146 కోట్లు
+ శంకుస్థాప‌న జ‌రిగింది:  ఏప్రిల్ 14, 2016
+ విగ్ర‌హావిష్క‌ర‌ణ ముహూర్తం:  ఏప్రిల్ 14, 2023

అమ‌ర శిల్పి!!
ఔను.. అమ‌ర శిల్పి జ‌క్క‌న్న మాదిరిగానే.. హైద‌రాబాద్‌లో కొలువుదీర‌నున్న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని నిర్మించిన శిల్పికి కూడా అంతే చ‌రిత్ర ఉంది. ప‌ద్మ అవార్డుల గ్ర‌హీత‌ స్థపతి రాంజీ సుతార్ చేతిలో ఈ విగ్ర‌హం జీవం పోసుకుంది. రామ్ వంజీ సుతార్ మ‌హారాష్ట్ర‌కు చెందిన ప్ర‌ముఖ శిల్పి. ఈయన త‌న  కుమారుడి స‌హ‌కారంతో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని తీర్చిదిద్దారు.

విక‌సించిన ప‌ద్మాలు..
సుతార్  శిల్ప క‌ళా నైపుణ్యానికి ప‌ద్మాలు వ‌రించాయి.  1999లో కేంద్ర‌ ప్రభుత్వం పద్మశ్రీతోను,  2016లో పద్మభూషణ్ తోనూ  సుతార్‌ను సత్కరించింది. దేశ సంస్కృతి ని కాపాడటంలో సుతార్ చేసిన సేవలకు గానూ.. 2018లో ఠాగూర్ అవార్డును కూడా ఆయ‌న‌ అందుకున్నారు. ఇక‌, 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ధూలే జిల్లాలోని గొండూరు గ్రామంలోని ఓ విశ్వకర్మ కుటుంబంలో సుతార్ జన్మించారు.

ఎన్నెన్ని శిల్పాలో..
+ సుతార్ చేతిలో జీవం పోసుకున్న శిల్పాలు అనేకం ఉన్నాయి. ఇవేవో .. చిన్న‌వో.. చిత‌క‌వో కావు.. ఏకంగా.. మ‌హామ‌హుల శిల్పాల‌కు ఆయ‌న ప్రాణం పోసిన‌ట్టుగా చెక్కారు. వీటిలో  స్టాట్యూ ఆఫ్ యూనిటీకి నిదర్శనంగా ప్రపంచంలోనే అతిపెద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తుతో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని.. గుజరాత్‌లోని నర్మదా నదిపై కేవడియా కాలనీలో నిర్మించారు.

+ అదేవిధంగా సుతార్ చేతిలో జీవం పోసుకున్న మహాత్ముని విగ్రహాలు ఎన్నో ఇతర దేశాలకు పంపారు  భారత పార్లమెంటు వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని రూపొందించింది కూడా సుతారే.

+ బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 108 అడుగుల ఎత్తైన కెంపె గౌడ విగ్రహానికి కూడా సుతార్ జీవం పోశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.