Begin typing your search above and press return to search.

బ్లాక్ రైస్ కి అరుదైన గుర్తింపు..మధుమేహంపై రామబాణం!

By:  Tupaki Desk   |   4 May 2020 11:30 PM GMT
బ్లాక్ రైస్ కి అరుదైన గుర్తింపు..మధుమేహంపై రామబాణం!
X
మధుమేహం అదే చక్కర వ్యాధి. ఇది నేడు వయోభేదం లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న ప్రాణాంతక వ్యాధి. కొందరిలో ఇది ఉందని కూడా తెలియకుండానే ముదిరిపోయి, ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇకపోతే, ప్రస్తుతం కరోనా దేశాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో మణిపూర్‌ బ్లాక్‌ రైస్ ‌కు అరుదైన గుర్తింపు లభించింది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం లాంటి ఈ చఖావో రకం బియ్యానికి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌ లభించినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.

ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్ ‌లో మణిపూర్ బ్లాక్ రైస్ పేరిట నమోదు చేసింది. పూర్తి వివరాలు చూస్తే .. మణిపూర్‌ బ్లాక్‌ రైస్ ‌కు జిఐ ట్యాగ్‌ ఇవ్వాలంటూ మణిపూర్ లోని చాఖావో కన్సార్టియం ప్రొడ్యూసర్స్ ఏడాది కిందట దరఖాస్తు చేసింది. దీనికి వ్యవసాయ శాఖ, మణిపూర్ ప్రభుత్వం తో పాటు నార్త్ ఈస్టర్న్ రీజినల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ బృంద సభ్యుల డాక్యుమెంటేషన్‌ తో సహా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏడాదికి పైగా సమయం పట్టిందని అధికారులు వివరించారు. ఒక నిర్ధిష్ట ప్రాంతం నాణ్యత కలిగిన ఉత్పత్తి చేస్తున్న వస్తువును గుర్తించి భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్‌ ఇస్తారు.

ఈ రకం బియ్యం మార్కెటింగ్ చేసుకునేందుకు జీఐ ట్యాగ్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు సంప్రదాయంగా ఆచరిస్తున్న నైపుణ్యాలను కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదే విషయమై ప్రాజెక్ట్‌ కో- ఆర్డినేటర్‌, మణిపూర్‌ అగ్రి బిజినెస్‌ కన్సార్టియమ్‌ అధికారి ఎమ్‌ఎస్‌ ఖైదెం మాట్లాడుతూ.. మణిపూర్‌ బ్లాక్ ‌రైస్‌ జిఐ ట్యాగ్‌ ను పొందడం అరుదైన విషయమన్నారు. ఇప్పుడు బ్లాక్‌ రైస్‌ విత్తనాలను ప్రపంచంలో ఎక్కడైనా అమ్మే శక్తి తమకు ఉందన్నారు. వాణిజ్య పరంగా మంచి అవకాశాలు ఉండే అవకాశముందని అభిప్రాయ పడ్డారు.

మరోవైపు.. తాము అధిక ప్రోటీన్ కంటెంట్ స్థానిక బఠానీ రకం ‘హవాయి-తారక్ మఖ్యాత్ముబి’ కి జిఐ ట్యాగ్‌ లభించే విధంగా ప్రక్రియను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖైదెం పేర్కొన్నారు. శతాబ్దాలుగా మణిపూర్‌ లో సాగులో ఉన్న చాఖవో అనే సువాసన గల గ్లూటినస్ వరి మంచి సువాసన కలిగి ఉంటుంది. ఈ బ్లాక్ రైస్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే విందులో వండుతారు. దీనిని చాఖావో ఖీర్ ‌గా కూడా పిలుస్తుంటారు. మణిపూర్‌ బ్లాక్‌ రైస్‌ కిలో రూ.100 నుంచి 120 మధ్య ఇంఫాల్‌ స్థానిక మార్కెట్లో లభిస్తుంది.