Begin typing your search above and press return to search.

నెల్లూరు ఫ్ల‌క్సీల వివాదం.. మంత్రి కాకాణి కామెంట్లు ఇవే!

By:  Tupaki Desk   |   20 April 2022 3:52 AM GMT
నెల్లూరు ఫ్ల‌క్సీల వివాదం.. మంత్రి కాకాణి కామెంట్లు ఇవే!
X
కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశాక తొలిసారి నెల్లూరు రావడం.. అదే రోజు అదే నగరంలో మాజీమంత్రి అనిల్ సభ నిర్వహణ ప్రకటనతో వర్గపోరు అనుమానాలు ఊపందుకున్నాయి. బల ప్రదర్శనకు ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్నలూ వచ్చాయి. పోలీసులు కూడా సిబ్బందిని భారీగా మోహరించారు. ఈ క్రమంలో....ఇద్దరు నేతలతోనూ పార్టీ పెద్దలు మాట్లాడినట్లు సమాచారం. ఎవరి కార్యక్రమాలు వారు....వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా నిర్వహించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఫలితంగా వర్గపోరేమీ లేదన్నట్లుగా....కాకాణి, అనిల్ సభలు ముగించారు.

మ‌రోవైపు నెల్లూరు న‌గ‌రంలో ఫ్లెక్సీల వివాదం కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఆయా అంశాల‌పై మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స్పందించారు. త‌మ మ‌ధ్య వివాదాలు విభేదాలు లేవ‌ని.. ఎవ‌రో కావాల‌నే వివాదాలు సృష్టించేందుకు ఇలా చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను మంత్రిగా పదవిలో ఉన్నప్పుడు కాకాణి తనపై చూపించిన ప్రేమ, ఆప్యాయతను రెట్టింపు స్థాయిలో తిరిగిచ్చేస్తానంటూ పరోక్షంగా అనిల్ సెటైర్స్ వేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై మంత్రి కాకాణి చాలా కూల్ గా స్పందించారు.

అనిల్ అన్నదాంట్లో తప్పేముందని మీడియాని ఎదురు ప్రశ్నించారు. అనిల్ రెట్టింపు సహకారం ఇస్తామన్నారు దాంట్లో తప్పేముందని అన్నారు. తమ మధ్య ఉన్న సహాయ సహకారాలు మీడియాకు తెలియవు కదా అని ప్రశ్నించారు. తామెప్పుడూ ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉంటామని చెప్పారు. అనిల్ తనకు రెట్టింపు సహకారం ఇస్తామన్న మాటలను స్వాగతిస్తున్నానని, అలా రెట్టింపు ఇస్తే తనకు సంతోషమేనన్నారు.

ఇక మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం రోజు తనకు కాకాణి నుంచి ఆహ్వానం అందలేదని కూడా అనిల్ కుమార్ యాదవ్ కామెంట్ చేశారు. దీనికి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు కాకాణి. తాను అందరినీ ఆహ్వానించానని, ఆహ్వానం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేదని, అది వ్యక్తిగత విషయం అని దాని గురించి బయట మాట్లాడనన్నారు. కొన్ని కారణాల వల్ల ఫోన్లు కలవకపోవచ్చని, మెసేజ్ చేరి ఉండకపోవచ్చని చెప్పారు.

పార్టీలోని నేతలందరం కలిసిమెలిసి పనిచేస్తున్నామని మంత్రి కాకాణి తెలిపారు. తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని చెప్పారు. విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు అండగా ఉంటున్నామని తెలిపారు. ఇద్దరి మధ్య విబేధాలను పెంచేందుకు కొంతమంది ఫ్లెక్సీలను చించివేశారని అన్నారు. ఎవరూ ఫ్లెక్సీలను కావాలని తొలగించరని తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌ ఫ్లెక్సీలు తాను చించను, తన ఫ్లెక్సీలు ఆయన చించరని తెలిపారు.

అంతకుముందు మంత్రిస్థాయిలో తొలిసారి జిల్లాకు వచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. రోడ్‌షో అనంతరం సభ నిర్వహించారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే నగర ఎమ్మెల్యేఅనిల్ కుమార్ సహా గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి హాజరవలేదు. ఈ క్రమంలో మంత్రిగా అందరినీ కలుపుకొని పనిచేస్తానంటూ కాకాణి స్పష్టం చేశారు