Begin typing your search above and press return to search.

ఆయ‌న మాజీ ఎంపీ.. స‌మాజానికి ఎలాంటి లెస్స‌న్ చెప్పారంటే!

By:  Tupaki Desk   |   8 Nov 2022 2:30 AM GMT
ఆయ‌న మాజీ ఎంపీ.. స‌మాజానికి ఎలాంటి లెస్స‌న్ చెప్పారంటే!
X
నేటి కాలంలో ఆద‌ర్శాల‌ను పాటించేవారు.. స‌మాజానికి ఉన్న‌త విలువ‌లు నేర్పేవారు చాలా వ‌ర‌కు క‌నుమ‌రుగైపోయార‌నే చెప్పాలి. కుటుంబ విలువ‌ల‌ను అసలు పాటిస్తున్న‌వారు కూడా చాలా వ‌ర‌కు త‌గ్గిపోయారు. అయితే.. ఓ మాజీ ఎంపీ మాత్రం స‌మాజానికి ఆద‌ర్శంగా నిలిచారు.

వితంతువైన తన కోడలి విషయంలో.. తండ్రిలా ఆలోచించి ఓ ఆద‌ర్శ‌వంత‌మైన‌ పని చేశారు. తన కొడుకు చనిపోగా కోడలికి రెండో పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. ప్ర‌స్తుతం ఆ మాజీ ఎంపీ చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు.

ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని ధమ్తరీ జిల్లాలో ఉన్న‌ మహాసముంద్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎంపీ చందూలాల్ సాహు కుమారుడికి, కల్యాణి సాహు అనే అమ్మాయికి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన నాలుగేళ్లకే..

చందూలాల్ కొడుకు అనారోగ్యంతో మరణించాడు. దీంతో.. కల్యాణి ఏడాదిన్నర వయసున్న కుమారుడితో ఒంటరిగా మారింది. అప్పటి నుంచి తన మామ చందూలాల్ సాహు.. కోడలికి రెండో వివాహం చేయడానికి తగిన వరుడి కోసం వెతికారు.

ఈ నేప‌థ్యంలో.. ధమ్తరీకి చెందిన డాక్టర్ వీరేంద్ర గంజీర్ గురించి తెలిసింది. వీరేంద్రకు కూడా గతంలో పెళ్లి కాగా భార్య గుండెపోటుతో మరణించింది. అప్పటి నుంచి వీరేంద్ర తన కుమారైతో ఒంటరిగా జీవిస్తున్నాడు. వారిద్దరి అసంపూర్ణ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇద్దరి కుటుంబ సభ్యులు చర్చలు జరిపి వారికి వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ క్ర‌మంలో మాజీ ఎంపీ కీల‌క పాత్ర పోషించారు.

వీరి వివాహానికి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ధమ్తరీలోని వింధ్యవాసిని ఆలయంలో అందరి సమక్షంలో వేద మంత్రాల మ‌ధ్య వారికి వివాహం జ‌రిపించారు. ఇక నుంచీ కొత్త జీవితాన్ని ఆనందంగా గడపాల‌ని ఆశీర్వ‌దించారు. మాజీ ఎంపీ చేసిన ఈ ఆద‌ర్శవంత‌మైన ప‌నిని నెటిజ‌న్లు స్వాగ‌తిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.