Begin typing your search above and press return to search.

కొత్త పార్ల‌మెంటులో 'రాజ‌దండం'.. ఏంటి ప్ర‌త్యేక‌త‌.. ఎందుకు ఏర్పాటు!

By:  Tupaki Desk   |   24 May 2023 6:37 PM GMT
కొత్త పార్ల‌మెంటులో రాజ‌దండం.. ఏంటి ప్ర‌త్యేక‌త‌.. ఎందుకు ఏర్పాటు!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సెంట్ర‌ల్ విస్టా పేరుతో కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే. దీనిని ఈ నెల 28 న ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై విప‌క్షాలు ఆందోళ‌న చేయ‌డం.. బ‌హిష్క‌ర‌ణ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం తెలిసిందే.

ఇది ఎలా ఉన్నా.. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది. నూత‌న పార్ల‌మెంటు భవనంలో స్పీకర్‌ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రక రాజ దండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఈ రాజ‌దండాన్ని బ్రిటీషర్ల నుంచి బారతీయులకు అధికార మార్పిడి జరిగిందనేందుకు గుర్తుగా మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకి అందజేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ రాజదండాన్ని 'సెంగోల్‌' అని పిలుస్తారు. ఇది తమిళ పదం సెమ్మై నుంచి వచ్చింది. దీని అర్థం 'ధర్మం'. ధ‌ర్మం ప్ర‌కారం స్పీక‌ర్ వ్య‌వ‌హ‌రించి.. పార్ల‌మెంటును స‌జావుగా ముందుకు న‌డిపించాల‌నే ల‌క్ష్యంతో దీనిని పార్ల‌మెంటులో ఏర్పాటు చేస్తున్న‌ట్టు కేంద్ర వెలువ‌రించిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

చోళుల సంప్ర‌దాయం ప్ర‌కారం..చివరి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అధికార మార్పిడికి గుర్తుగా ఏదోకటి విలువైనది ఉండాలని నాటి తొలి ప్రధాని నెహ్రుని అడిగారు. అప్పడు ఆయన సలహ కోసం నాటి గవర్నర్‌ రాజాజీగా పిలిచే సీ రాజగోపాలా చారిని ఆశ్రయించారు. ఆయన ఈ 'సెంగోల్‌ని' సూచించారు. చోళుల పాలనలోని సంప్రదాయాన్ని అనుసరించి 'సెంగోల్‌' అనే రాజదండాన్ని సూచించారు. ఇది భారతదేశానికి స్వేచ్ఛ లభించిందని సూచించగలదని, పైగా అధికార మార్పిడికి చిహ్నంగా ఉండగలదని నెహ్రుతో రాజాజి చెప్పారు.

ఈ రాజదండాన్ని ఏర్పాటు బాధ్యతను తీసుకున్న రాజాజీ తమిళనాడులోని ప్రముఖ మఠమైన తిరువడుతురై అథీనంను సంప్రదించారు. ఆ మఠం దీన్ని రూపొందించే బాధ్యతను స్వీకరించింది. అప్పటి మద్రాసులో నగల వ్యాపారి వుమ్మిడి బంగారు చెట్టి ఈ సెంగోల్‌ను తయారు చేశాడు.

ఇది ఐదుడుగుల పొడువు ఉండి, పైన న్యాయానికి ప్రతిక అయిన నంది(ఎద్దు) ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగ‌స్టు 14, 1947 అర్థరాత్రి 15 నిమిషాల ముందు గంగాజలంతో అభిషేకించి, ప్రధానమంత్రి నెహ్రు వద్దకు ఊరేగింపుగా వెళ్లి ఆయనకు అప్పగించారు. ప్రధాని నెహ్రు రాజ దండాన్ని అందుకున్నారు.

కొత్త పార్లమెంట్‌లో దీనిని ఏర్పాటు చేయడం వల్ల మన సంస్కృతి సంప్రదాయాలను నేటి ఆధునికతకు జోడించే ప్రయత్నం చేస్తున్న‌ట్టు కేంద్రం పేర్కొంది. కొత్త పార్లమెంట్‌లో 'సెంగోల్‌'ను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా ప్రధాని మోడీ దూరదృష్టిని ప్రతిబింబిస్తోందని కేంద్రం ప్రక‌టించింది. 'సెంగోల్' ఇప్పుడు అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. ఇప్పుడు దాన్ని కొత్త పార్లమెంటుకి తీసుకురానున్నారు.