Begin typing your search above and press return to search.

పల్నాడు జిల్లాలో కీలక స్థానంలో టీడీపీ అభ్యర్థి ఈయనే!

By:  Tupaki Desk   |   18 Oct 2022 5:14 AM GMT
పల్నాడు జిల్లాలో కీలక స్థానంలో టీడీపీ అభ్యర్థి ఈయనే!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటి నుంచే పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. గత కొద్దిరోజులుగా ఆయన రోజూ జిల్లాలవారీగా నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నారు. అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. తనకున్న నివేదికలు, సర్వేల ఆధారంగా గట్టిగా ఉన్నారనుకున్న అభ్యర్థులను నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు మీరేనని స్పష్టం చేస్తున్నారు.

కాగా పల్నాడు జిల్లాలో వినుకొండ కీలక నియోజకవర్గం. అటు రాయలసీమను, ఇటు గుంటూరు జిల్లాలను కలిపే మార్గంలో ఈ నియోజకవర్గం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేశారు.

పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు చంద్రబాబు సీటు కన్ఫర్మ్‌ చేశారని తెలుస్తోంది. జీవీ ఆంజనేయులతో చంద్రబాబు తాజాగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరిస్థితి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ నేపథ్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గంలో బాగా నిర్వహించారని, టీడీపీ సభ్యత్వ నమోదులోనూ వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో ఉందని చంద్రబాబు.. జీవీ ఆంజనేయులను అభినందించినట్టు సమాచారం. అలాగే నియోజకవర్గంలోని శ్యావలాపురం మండలం జెడ్పీటీసీ స్థానంలో టీడీపీని గెలిపించారని ప్రశంసించారు.

తనకున్న నివేదికలు, సర్వేల ఆధారంగా మీ గెలుపు ఖాయమని.. జాగ్రత్తగా పనిచేసుకోవాలని జీవీ ఆంజనేయులకు చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని.. భారీ మెజారిటీని సాధించాలని చంద్రబాబు సూచించినట్లు జీవీ ఆంజనేయులు చెబుతున్నారు.

కాగా కమ్మ సామాజికవర్గానికి చెందిన జీవీ ఆంజనేయులు 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున వినుకొండ నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి బొల్లా బ్రహ్మనాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా జీవీ ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కెన మల్లికార్జునరావు చేతిలో ఓడిపోయారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.