Begin typing your search above and press return to search.

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ తనయుడికి సీటు లభించేనా?

By:  Tupaki Desk   |   21 Jan 2023 9:03 AM GMT
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ తనయుడికి సీటు లభించేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపాలని ఆయా పార్టీల నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటివారు వైసీపీలో ఎక్కువ మంది ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా బాపట్ల జిల్లా రేపల్లెలో సీఎం వైఎస్‌ జగన్‌ కు నమ్మిన బంటుగా ఉన్న మోపిదేవి వెంకట రమణారావు తన కుమారుడు రాజీవ్‌ ను బరిలోకి దించడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

మోపిదేవి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రేపల్లెలో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఈ రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌ విజయం సాధించారు. కాగా రేపల్లె నుంచి 2009లో మాత్రమే మోపిదేవి వెంకట రమణారావు గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్సార్‌ మంత్రివర్గంలో పెట్టుబడులు, ఓడరేవులు, మౌలిక సదుపాయాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మోపిదేవి జైలుపాలయ్యారు.

దీంతో తనవల్లే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మోపిదేవి మంత్రి పదవి పోగొట్టుకున్నారని.. జైలుపాలయ్యారని వైఎస్‌ జగన్‌ కు ఓ కన్సర్న్‌ ఉంది. దీంతో 2019లో మోపిదేవి వెంకట రమణారావు రేపల్లెలో ఓడిపోయినప్పటికీ ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీగా ఆయనను ఎంపిక చేశారు. ఆ తర్వాత శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మోపిదేవి వెంకట రమణారావును, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ను రాజ్యసభకు పంపారు.

ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ విశ్వసించే అతి తక్కువమంది వైసీపీ నేతల్లో ఒకరిగా మోపిదేవి వెంకట రమణారావు పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి వాస్తవానికి మోపిదేవి వెంకట రమణ వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉంది.

అయితే 2020లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవికి 2026 వరకు పదవీ కాలం ఉంది. ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీకి పోటీ చేస్తే రెండేళ్లు ముందుగానే తన ఎంపీ పదవిని పోగొట్టుకునే అవకాశం ఉంది. మరోవైపు 2019లో వైసీపీ గాలిలోనే రేపల్లెలో గెలవలేకపోయిన మోపిదేవి 2024లో గెలుపొందడం కూడా అంత సులువు కాదు.

ఈ నేపథ్యంలో మోపిదేవి రాజ్యసభ సభ్యుడిగానే ఉండాలనుకుంటున్నారు. అసెంబ్లీకి తనకు బదులుగా తన కుమారుడు రాజీవ్‌ ను పోటీ చేయించాలనే యోచనలో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. ఈ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ కు కూడా చెబుతారని.. ఆయన ఆదేశాల మేరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.