Begin typing your search above and press return to search.

చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే.. దొంగ ఓట్లపై విచారణకు ఈసీ ఆదేశం!

By:  Tupaki Desk   |   5 May 2023 4:03 PM IST
చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే.. దొంగ ఓట్లపై విచారణకు ఈసీ ఆదేశం!
X
2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాదరావు గెలుపొందిన సంగతి తెలిసిందే. మొదట్లో తాను జనసేన పార్టీలోనే ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపుతో ఉంటానని చెప్పిన రాపాక ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి వైసీపీతో అంటకాగుతూ వస్తున్నారు. తన కుమారుడిని కూడా వైసీపీలో చేర్పించారు. పలు సభలు, సమావేశాల్లోనూ మెడలో వైసీపీ జెండాలతో రాపాక కనిపించారు.

ఇలా ఒకసారి కార్యకర్తలతో ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను దొంగ ఓట్లతోనే తాను గెలిచానంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో అప్పట్లో రాష్ట్రమంతా వైరల్‌ అయ్యింది.

రాపాక చేసిన వ్యాఖ్యలపై రాజోలు నియోజకవర్గం కేశవదాసుపాలెంకు చెందిన ఎనుముల వెంకటపతి రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాపాకపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా.. రాపాక ఉదంతంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో ఈ నివేదిక సమర్పించాలని సూచించారు.

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అంతర్వేదిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తాను గతంలో సర్పంచ్‌ గా గెలిచినప్పుడు దొంగ ఓట్లతో గెలిచానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్‌ బూత్‌ లో తనకు దొంగ ఓట్లు పడేవని తెలిపారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేసేసేవారన్నారు. దీంతో తనకు చింతలమోరి గ్రామంలో ఏడు నుంచి ఎనిమిది వందల వరకు మెజారిటీ వచ్చేదంటూ.. అదేదో ఘనకార్యమన్నట్టు రాపాక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో అప్పట్లో వైరల్‌ అయ్యింది.

ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. కాగా 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజోలులో గెలిచిన రాపాక 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరఫున సీటు దక్కకపోవడంతో జనసేన నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.