Begin typing your search above and press return to search.

నాకు ముందస్తు బెయిల్‌ ఇవ్వండి: హైకోర్టులో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌!

By:  Tupaki Desk   |   17 April 2023 11:27 AM
నాకు ముందస్తు బెయిల్‌ ఇవ్వండి: హైకోర్టులో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌!
X
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి మేనమామ, కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి అయిన వైఎస్‌ భాస్కర రెడ్డి ని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను హైదరాబాద్‌ లోని సీబీఐ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను చెంచలగూడ జైలుకు తరలించారు.

మరో వైపు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కి సీబీఐ మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే నాలుగుసార్లు అవినాష్‌ ను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఐదోసారి విచారణకు రావాలని అవినాష్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరారు. ఈ మేరకు తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని అవినాష్‌ రెడ్డి తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఉన్న బెంచ్‌ లో లంచ్‌ పిటిషన్‌ వేశారు. దీని పై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరుగుతుంది. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు.

మరోవైపు సీబీఐ విచారణకు ఐదోసారి హాజరు కావడానికి అవినాష్‌ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. ఆయనతో భారీ ఎత్తున అనుచరులు, చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుపెంచింది. ఏప్రిల్‌ 30 నాటికి విచారణ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వేగంగా విచారణ సాగిస్తోంది. రెండు రోజుల క్రితం వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ ఏప్రిల్‌ 17న అవినాష్‌ తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసింది.

తన తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు పై స్పందించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. ఊహించని విధంగా అరెస్ట్‌ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. సీబీఐ ఈ కేసు విచారణలో కీలక అంశాలను విస్మరిస్తోందని అర్థం పర్థం లేని విషయాలను పెద్దదిగా చూపిస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టు ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది.