Begin typing your search above and press return to search.

వాయు కాలుష్యానికి రూ.1 కోటి జరిమానా

By:  Tupaki Desk   |   29 Oct 2020 6:25 PM GMT
వాయు కాలుష్యానికి రూ.1 కోటి జరిమానా
X
చలికాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో నిండిపోతుంది. మంచు దుప్పటిలా కనిపించే ఇది భారీ కాలుష్యమని ఢిల్లీ వాసులకే తెలుసు. పంజాబ్, హర్యానా, యూపీ రైతులు వరి కంకులను కాల్చడం వల్ల కూడా భారీగా కాలుష్యం వెదజల్లుతోంది. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు.. భారీగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. దేశ రాజధానితోపాటు దేశమంతా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం సిద్ధమైంది.

రోజురోజుకు పెరిగిపోతూ కాలుష్య కారకంగా దేశం మారిపోతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. వాయు కాలుష్య కారకులకు భారీగా జరిమానాలు, కఠిన శిక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

తాజాగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆమోదం తెలుపడంతో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. వాయు కాలుష్య కారకులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి రూపాయల జరిమానా విధించేందుకు ఈ ఆర్డినెన్స్ అవకాశం కల్పించింది.

కేంద్రం ఆర్డినెన్స్ ప్రకారం.. దేశంలోని పలు రాష్ట్రాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ ఆర్డినెన్స్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ.1 కోటి వరకు జరిమానా లేదా ఈ రెండూ శిక్షలతో కమిషన్ శిక్షిస్తుంది. ఈ కమిషన్ ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేకుండా కేవలం హరిత ట్రిబ్యూనల్ (ఎన్.జీ.టీ)లోనే సవాల్ చేసేలా నిబంధనలు పొందుపరిచారు. దీంతో కాలుష్య కారకులకు ఇక మూడినట్టేనని ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.