Begin typing your search above and press return to search.

భారత్ మిత్రురాలైన ఆ అమెరి'గన్'.. తైవాన్ లో కాలుపెడితే..

By:  Tupaki Desk   |   27 July 2022 9:50 AM GMT
భారత్ మిత్రురాలైన ఆ అమెరిగన్.. తైవాన్ లో కాలుపెడితే..
X
నాన్సీ పెలోసీ.. అమెరికా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఏదైనా కాదంటే.. చేసి చూపుతుంది. భారత్ కు మిత్రురాలు.. చైనా అంటే ఒంటికాలిపై లేస్తుంది. మిగతా అమెరికా నాయకులు నిర్ణయాలు తీసుకోవడంలో తటపటాయిస్తారేమో కానీ, నాన్సీ దగర్గ మాత్రం నాన్చుడు ఉండదు. అందులోనూ చైనాను చెండాడే విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్తారు నాన్సీ పెలోసీ. చైనా అంటే అంత మంట ఆమెకు. ఈమె గురించి చైనా నాయకత్వానికీ బాగా తెలుసు. అందుకే నాన్సీ అంటేనే అలర్ట్ అవుతుంది. ఆధునిక చైనా చరిత్రలో రెండు ముఖ్య ఘట్టాలు.. తియాన్మెన్ స్వ్కేర్, ఒలింపిక్స్. ఈ రెండు సందర్బాల్లోనూ చైనాను ఇరుకునపెట్టాలని చూశారు నాన్సీ. ఇంతకూ నాన్సీ వయసు ఎంతనుకుంటున్నారు..? 82. ఈ వయసులోనూ ఆమె దూకుడుగా తైవాన్ వెళ్తానంటూ ప్రయాణం పెట్టుకున్నారు.

చైనా తాజా తలనొప్పి తైవాన్..డ్రాగన్ రాజ్యం కొంతకాలంగా తైవాన్ పై దూకుడుగా వెళ్తోంది. ఏకంగా ఫైటర్ జెట్ లను తైవాన్ గగనతలంలోకి పంపుతోంది. దీంతోపాటు తైవాన్ మాదేనంటూ.. "వన్ చైనా" నినాదాన్ని ఎత్తుకుంటోంది. ఆ విషయంలో తగ్గేది లేదని.. ఎవరైనా అడ్డొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాన్సీ పెలోసీ పర్యటన రీత్యా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది. మరోవైపు ఈ గొడవ ఎక్కడకు దారితీస్తుందోనంటూ అధ్యక్షుడు జో బైడెన్‌ యంత్రాంగం నాన్సీ పెలోసీకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తోంది.

తైవాన్ కు అమెరికా మద్దతు మనకు శ్రీలంకగా చైనాకు కింద ఉండే ప్రాంతమే తైవాన్. దీనికంటూ ప్రత్యేకంగా పతాకం ఉంది. తైవాన్ పారిశ్రామికంగానూ ప్రగతి సాధించిన ప్రాంతం. ఎప్పటినుంచో తైవాన్ మాదే అంటోంది చైనా. కానీ, అక్కడివారు.. తాము కొరియా, జపాన్ ద్వీపాల్లా స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్నారు. దీనికి అమెరికా ప్రజలు, అమెరికా కాంగ్రెస్‌ మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల తైవాన్‌కు వెళ్లాలని హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ నిర్ణయించుకొన్నారు. తనతోపాటు రావాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్లనూ ఆహ్వానించారు. వాస్తవానికి ఏప్రిల్‌లోనే ఆమె వెళ్లాల్సింది. కానీ, కొవిడ్‌-19 సోకడంతో ఆ పర్యటన వాయిదా పడింది. 1997లో రిపబ్లికన్‌ స్పీకర్‌ న్యూట్‌ గింగ్రిచ్‌ తర్వాత అక్కడికి వెళ్లిన స్పీకర్‌గా రికార్డు సృష్టించనున్నారు. నాన్సీ తన 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో చైనా విషయంలో ఎప్పుడూ కఠువుగానే వ్యవహరించారు. అటువంటి నేత ఇప్పుడు తైవాన్‌ వెళ్లడం డ్రాగన్‌ను భయపెడుతోంది.

తియనన్మెన్‌ స్క్వేర్‌ కు సంఘీభావం..చైనా చరిత్రలో తియానన్మెన్ స్వ్కేర్ పెద్ద విషాదం. 1989లో ప్రజాస్వామ్య పిపాసులపై డ్రాగన్ సైన్యం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. వందలాది మందిని హతమార్చింది. ఈ ఘటన జరిగింది తియానన్మెన్‌ స్క్వేర్‌ లో. అయితే, అప్పట్లోనే దీనిపై పెలోసీ తీవ్రంగా స్పందించారు. 1991లోస్వయంగా తియనన్మెన్‌ స్క్వేర్‌కు వెళ్లి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇది అత్యంత సంచలనం రేపింది. నాడు తన పర్యటనకు సంబంధించిన వీడియోను 2019లో ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు పెలోసీ. తను నిరసన తెలుపుతున్న సమయంలో భద్రతా సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా ఉన్నాయి. అంతేకాదు 2019లో హాంకాంగ్‌లో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు నాన్సీ.వీగర్ ముస్లింలకు మద్దతు, దలైలామతో భేటీ నాన్సీ ప్రతి చర్య చైనాకు కడుపు మంటే.

ఎందుకంటే.. ఆమె చైనా దమనకాండకు బలైన వీగర్ ముస్లింలకు, చైనా సామ్రాజ్యవాద కాంక్షతో భారత్ కు పారిపోయి వచ్చిన టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామకు మద్దతుగా నిలిచారు. వీగర్‌ ముస్లింలపై చైనా దారుణాకు నిరసనగా ఏకంగా బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని గత మేలో పిలుపునిచ్చారు.ప్రపంచ దేశాలు కూడా ఇలానే చేయాలని కోరారు. చివరికి అమెరికా మిత్రదేశాలు తమ దౌత్యసిబ్బందిని చైనాకు పంపకూడదని నిర్ణయించుకొన్నాయి. చైనా కూడా కొవిడ్‌ ఉందంటూ..ఎవరినీ ఆహ్వానించడంలేదని చెప్పి పరువు కాపాడుకొనే యత్నం చేసింది. టిబెట్‌ వాసులపై చైనా అరాచకాల మీద కూడా నాన్సీ గళం విప్పారు. అమెరికాలో బుష్‌ అధికారంలో ఉండగా చైనాలో జరిగిన బీజింగ్‌ సమ్మర్‌ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని సూచించారు. అప్పటికే ఆమె యూఎస్‌ హౌస్‌ స్పీకర్‌. బుష్‌ బీజింగ్‌ సందర్శించడాన్ని మరింత కఠినతరం చేసేలా ఆమె భారత్‌కు వచ్చి దలైలామాతో భేటీ కూడా అయ్యారు.

నాన్సీ తైవాన్ వచ్చారో.. మా విమానం వెళ్తుంది.. : చైనా పెలోసీ తైవాన్‌ పర్యటనపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా తన దారిలో తాను వెళితే.. చైనా తన సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకొనేందుకు దృఢమైన కఠిన చర్యలు తీసుకొంటుంది. ఆ తర్వాత ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని పేర్కొంది. మరో వైపు చైనా రక్షణ శాఖ కూడా స్పందించింది. పెలోసీ పర్యటన రద్దుచేసుకోవాలని అమెరికాను హెచ్చరించింది. తైవాన్‌ ప్రజలను ప్రజాస్వామ్యం పేరిట రెచ్చగొట్టే యత్నం చేస్తే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే చర్యలు తీసుకొంటామని వెల్లడించింది.పెలోసీ పర్యటనపై చైనా గ్లోబల్‌ టైమ్స్‌ మాజీ ఎడిటర్‌ హూ షీజిన్‌ స్పందిస్తూ.. "ఒక వేళ పెలోసీ తైవాన్‌లో పర్యటించాలనుకుంటే.. ఆమె విమానంతోపాటు.. చైనా సైనిక జెట్‌ విమానం కూడా వస్తుంది. చరిత్రలో తొలిసారి చైనా నుంచి ఓ ఫైటర్‌జెట్‌ తైవాన్‌లోకి వెళుతుంది" అంటూ బెదిరింపులకు దిగారు.

2020లో అమెరికా హెల్త్‌ సెక్రటరీ అలెక్స్‌ అజర్‌ తైవాన్‌లో పర్యటించగా.. అప్పట్లో చైనా యుద్ధవిమానాలు తైవాన్‌ గగనతలంపై ఎగిరాయి.పవర్ ఫుల్ పెలోసీ అమెరికాలో పదవుల రీత్యా అత్యంత పవర్ ఫుల్ అధ్యక్షుడు. అధ్యక్షుడు వైదొలగినా.. అకస్మాత్తుగా కన్నుమూసినా ఎన్నికలు జరుపరు. ఉపాధ్యక్షులకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు.వారి తర్వాత హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌ స్పీకర్‌ (ప్రస్తుతం నాన్సీ పెలోసీ ఉన్న స్థానం) రెండో స్థానంలో ఉంటారు. ఈ నేపథ్యంలో నాన్సీ పవర్ ఫుల్ కిందనే లెక్క. అందుకనే ఆమె బయల్దేరిన విమానం వెళ్లినప్పటి నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే సైనిక వనరులు కూడా వాడాల్సి రావొచ్చు.బైడెన్, జిన్ పింగ్ ఏ మాట్లాడుకుంటారో?

పెలోసీ పర్యటన ఓ వైపు సెగలు రేపుతుండగా.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌తో టెలిఫోన్‌లో గురువారం సంభాషించుకోనున్నారు. ఇప్పటికే బైడెన్‌ బృందం పెలోసీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత వారం బైడెన్‌ మాట్లాడుతూ పెలోసీ పర్యటన అమెరికా సైన్యానికి ఇష్టంలేదని పేర్కొన్నారు. దీనికి పెలోసీ వెటకారంగా స్పందించారు. అమెరికా సైన్యం భయపడుతోందేమో అని పేర్కొన్నారు. కాకపోతే ఇప్పటి వరకు పెలోసీ పర్యటనపై అధికారికంగా ప్రకటించలేదన్నారు.